భగీరథి నదిలో బస్సు బోల్తా: 13 మంది రష్యన్ల మృతి
డెహ్రాడూన్: భగీరథీ నదిలో ఓ బస్సు బోల్తా పడి 13 మంది రష్యన్లు మృతి చెందారు. గంగోత్రి వెళ్తుండగా బస్సు భగీరథి నదిలో పడిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న పదమూడు మంది రష్యా పర్యటకులు మృతి చెందారు. ఈ ఘటన ఉత్తరకాశీ జిల్లాలో జరిగింది.
హార్స్లీకి రెండు కిలోమీటర్ల దూరంలో గల ధరాలీ వద్ద ప్రమాదం జరిగింది. బస్సు గంగోత్రి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని, ఘటన జరిగిన విషయం తెలియగానే అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారని పోలీసులు చెబుతున్నారు.
మరో బిజెపి నేత హత్య
ఉత్తరప్రదేశ్కు చెందిన భారతీయ జనతా పార్టీ నేత ఓంవీర్ (40) హత్యకు గురయ్యారు. ముజఫర్నగర్లోని మీర్పూర్ ప్రాంతంలో బైక్ పైన వచ్చిన ఇద్దరు దుండగులు కాల్చడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. వారం రోజుల కిందట ఇదే రాష్ట్రానికి చెందిన బిజెపి నేత విజయ్ పండిట్ను గ్రేటర్ నోయిడాలో తుపాకీతో కాల్చి చంపారు.
ముండే మృతిపై సిబిఐ దర్యాఫ్తు
బిజెపి నేత గోపీనాథ్ ముండే మృతిపై సిబిఐ దర్యాప్తుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సిఫారసు చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేయించాలంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్రకు చెందిన ఓ బిజెపి నేత మంగళవారం ఉదయం హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను కలసి డిమాండ్ చేశారు. ఈ నెల 3న ఢిల్లీలో ముండే కారు ప్రమాదానికి గురై.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే.