దారి చూపిస్తానని చెప్పి అమ్మాయిపై అత్యాచారం
పూణే: దారి తప్పిన 18 ఏళ్ల యువతికి దారి చూపిస్తానని నమ్మబలికి ఓ వ్యక్తి ఆమెపై అత్యాచారం చేశాడు. నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు గురువారంనాడు చెప్పారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని పూణేలో జరిగింది. అమ్మాయి ఓ ప్రముఖ కళాశాలలో చదువుతోంది.
సోమవారం రాత్రి మరో కళాశాలలో చదువుతున్న తన స్నేహితురాలిని కలిసేందుకు బయలుదేరిన విద్యార్థిని బాబాసాహెబ్ అంబేడ్కర్ భవన్ వద్ద దారి తప్పింది. నగరానికి ఆ అమ్మాయి కొత్త అని, దీంతో దారి కనుక్కోలేకపోయిందని బండ్ గార్డెన్ పోలీసులు చెప్పారు
మాల్ధాక్క చౌక్ వద్ద ఉన్నప్పుడు నిందితుడు నావెల్ జోసెఫ్ (32) ఆమెను కలిశాడు. గతంలో క్లబ్లో బౌన్సర్గా పనిచేసిన జోసెఫ్ ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు. కళాశాలకు దారి చూపిస్తానని ఆమెను అతను నమ్మించాడు. దారి కోసం ఆమె తన స్నేహితురాలికి ఫోన్ కూడా చేసింది. దారి చూపిస్తానని చెప్పి విద్యార్థినిని నిందితుడు ఖడ్కీ ఏరియాలోని రేంజ్ హిల్స్ ఎస్టేట్లో గల నిర్మానుష్య ప్రదేశానికి తీసుకుని వెళ్లాడు.
అక్కడ ఆమెపై సోమవారం, మంగళవారం మధ్య రాత్రి అత్యాచారం చేశాడు. మంగళవారంనాడు తెల్లవారు జాము 2 గంటల 15 నిమిషాల ప్రాంతంలో ఆమె ఓ పెట్రోల్ బంక్ వద్దకు చేరుకుంది. గస్తీలో ఉన్న పోలీసులు ఆమెను గమనించారు. పోలీసుల సహాయంతో ఆమె ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత సెప్టెంబర్ 30వ తేదీన పోలీసులు జోసెఫ్ను అరెస్టు చేశారు.