ఘోర అవమానం, అందుకే మాయావతి నో, రాజకీయం..
లక్నో: భారతీయ జనతా పార్టీని ఓడించేందుకు ములాయం సింగ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాది పార్టీతో కలిసేందుకు బహుజన సమాజ్ వాది పార్టీ అధ్యక్షురాలు మాయావతి నిరాకరించిన విషయం తెలిసిందే. అయితే, ఆమె నో చెప్పడానికి 1995లో ఎస్పీ నుండి ఆమెకు ఎదురైన పరాభవమే కారణమని భావిస్తున్నారు. తనకు ఎదురైన ఘోర పరాభవం కారణంగానే ఆమె ములాయం ప్రతిపాదనను తిరస్కరించిందని అంటున్నారు.
బీహార్లో బీజేపీని ఓడించేందుకు బద్దశత్రువులు అయిన లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ జేడీయుతో చేతులు కలిపింది. లాలూ, నితీష్ కుమార్లో ఉప ఎన్నికల కోసం కలిసి ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. బీహార్, ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో నిన్నటి వరకు బీజేపీ ఉనికి నామమాత్రమే. ఇప్పుడు ఆ పార్టీ బలంగా పుంజుకుంది. ఈ నేపథ్యంలో బీహార్లో తాను, నితీష్ కలిసినట్లు యూపీలో మాయా, ములాయం కలవాలని లాలూ చెప్పారు.
లాలూ వ్యాఖ్యల పైన స్పందించిన ములాయం.. ఆయన మధ్యవర్తిత్వం వహిస్తే మాయావతితో కలిసేందుకు సిద్ధమని చెప్పారు. అయితే, మాయావతి మాత్రం తాను కలిసే ప్రసక్తి లేదని చెప్పారు. అయితే, ఆమె కలిసేందుకు నిరాకరించడం వెనుక దాదాపు ఇరవయ్యేళ్ల నాటి అవమానం కూడా ఓ కారణమని, అదే అతిపెద్ద కారణమని చెబుతున్నారు. అదే సమయంలో రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా కూడా ఆమె నో చెప్పిందని అంటున్నారు.
1993లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీలు కలిసి బీజేపీని ఎదుర్కొని విజయం సాధించాయి. సంకీర్ణ ప్రభుత్వంలో ములాయం సీఎం అయ్యారు. ఆ తర్వాత దళితుల మీద ఎస్పీ కార్యకర్తల దాడులు మొదలయ్యాయని, చర్యలు తీసుకోవాలని సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న మాయావతి డిమాండ్ చేశారని, దీనిని ములాయం పట్టించుకోలేదని చెబుతున్నారు. దీంతో ఆమె మద్దతు ఉపసంహరించుకోవడంతో ములాయం కుర్చీ పోయింది.
ఆగ్రహం పట్టని ఎస్పీ కార్యకర్తలు మాయావతిని తీవ్రంగా అవమానపర్చారు. ప్రభుత్వ అతిథి గృహంలో ఉన్న మాయావతి పైన దాడి చేయడమే కాకుండా, తీవ్రంగా అవమానపర్చారు. దీంతో పాటు రాజకీయ కోణం కూడా మాయావతి నో చెప్పడానికి కారణమంటున్నారు.
2017లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అఖిలేష్ యాదవ్ సర్కారు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. మూడేళ్లలో అది మరింత పెరిగే అవకాశముంది. మరోవైపు ఇప్పుడున్న మోడీ హావా మరో మూడేళ్ల తర్వాత ఉండకపోవచ్చు. అప్పుడు అంతిమంగా లబ్ధి పొందేది మాయావతి. ఆమె నో చెప్పడానికి ఇది కూడా ఓ కారణమంటున్నారు.