ఒత్తిడి: మహిళా టెక్కీ ఆత్మహత్య, చిన్న విషయాలకే..
ఇండోర్: డిప్రెషన్తో బాధపడుతున్న ఇరవై నాలుగేళ్ల ఓ మహిళా సాఫ్టువేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకుంది. ఆమె తన ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ముంబైకి చెందిన దీపా రాడారియా ఆరు నెలలుగా ఇండోర్లోని ఓ సాఫ్టువేర్ సంస్థలో పని చేస్తోంది.
ఎంజీ రోడ్డులోని అహింసా టవర్ అపార్టుమెంట్లోని తన ఫ్లాట్లో ఉరేసుకొని మరణించిందని టుకోగంజ్ స్టేషన్ ఇంచార్జి దిలీప్ సింగ్ చౌదరి తెలిపారు. తన సహోద్యోగి స్నేహతో కలిసి ఆమె ఆ ఫ్లాట్లో ఉంటోంది.
చిన్న చిన్న విషయాలకు కూడా దీప పదేపదే డిప్రెషన్కు లోనయ్యేదని ఆమె స్నేహితురాలు స్నేహ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. గత మూడు నాలుగు రోజులుగా ఆమె ఆరోగ్యం కూడా అంత బాగాలేదు. దాంతో స్నేహ ఆఫీసుకు వెళ్లకుండా సాయంగా ఉంటానని చెప్పినా, దీప బలవంతంగా ఆమెను ఆఫీసుకు పంపింది.
ఆఫీసుకు వెళ్లిన తర్వాత స్నేహ ఎన్నిసార్లు ఫోన్ చేసిన దీప నుండి సమాధానం లేదు. సాయంత్రం ఇంటికి వెళ్లి తలుపు తట్టంది. ఎంతగా తలుపు కొట్టినా తీయలేదు. దీంతో పక్క వారిని పిలిచి తలుపును బద్దలు కొట్టారు. తీరా చూస్తే ఆమె ఉరేసుకొని కనిపించంది. ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.