ఉరేసుకున్నమాజీ మోడల్: బాయ్ఫ్రెండ్పై ఆరోపణలు
ముంబై: 26 ఏళ్ల మాజీ మోడల్, ఫైనాన్షియల్ కన్సల్టెంట్ అర్చన పాండే ముంబైలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ముంబైలోని వెరసోవాలో గల తన అద్దె ఫ్లాట్లో సోమవారంనాడు ఆమె శవమై తేలింది. అంతకు రెండు రోజుల ముందే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు అంటున్నారు.
ఫ్లాట్లోంచి దుర్వాసన వస్తుండడంతో ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. సూసైడ్ నోట్ రాసి పెట్టి ఆమె ఆత్మహత్య చేసుకుంది. తన బాయ్ఫ్రెండ్ ఒమర్ పఠాన్ కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆమె అందులో రాసింది.
వెరసోవా పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. ఆత్మహత్యకు ప్రేరేపించాడనే ఆరోపణపై పఠాన్ మీద వారు కేసు నమోదు చేశారు. తాము అన్ని వివరాలను సేకరించామని, వాటిని పరిశీలిస్తున్నామని, తమ పరిశీలన తేలిన అంశాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని జోన్ 9 డిప్యూటీ పోలీసు కమిషనర్ నారాయణ్ చౌధురి చెప్పారు
అర్చన్ వెరసోవాలోని న్యూ మహద కాలనీలో గల శుభం కరోటి భవనంలోని 12వ అంతస్థులో నివసిస్తోంది. ఇరుగు పొరుగు వారు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు తీసి బెడ్రూంలోని సీలింగ్ ఫ్యాన్కు వేలాడుతున్న అర్చన మృతదేహాన్ని చూశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కూపర్ ఆస్పత్రికి తరలించారు.
పఠాన్ తనను వేధిస్తూ వచ్చాడని, తన పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించాడని ఆమె తన సూసైడ్ నోట్లో ఆరోపించింది. అర్చన 2009 మోడలింగ్ వృత్తిని వదిలేసింది. మీర్జా ప్రొడక్షన్ హౌస్లో పనిచేస్తోంది. ఆమె మెుబైల్ కాల్స్ను, ఎస్ఎంఎస్ సందేశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అర్చన సోదరుడు చీటింగ్ కేసులో గుజరాత్లో అరెస్టయి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.