65 ఏళ్ల వృద్ధురాలిని వివస్త్రను చేసిన టీసీలు, సస్పెన్షన్
ముంబై: రెండో తరగతి టికెట్తో ముంబై సబర్బన్ రైల్లోని మొదటి తరగతి బోగీలో ఎక్కిన అరవై అయిదేళ్ల వృద్ధురాలిని బట్టలూడదీసి సోదా చేశారన్న ఆరోపణలపై ఇద్దరు మహిళా టీసీలను సస్పెండ్ చేశారు. ప్రాథమిక దర్యాప్తు తర్వాత ఈ ఇద్దరు మహిళా టీసీలను సస్పెండ్ చేసినట్లు పశ్చిమ రైల్వే డివిజనల్ మేనేజర్ శైలేంద్ర కుమార్ ఆదివారం చెప్పారు.
ఈ మహిళ ఈ నెల 25న అంధేరీ స్టేషన్లో సబర్బన్ రైలు ఎక్కిందని, రెండో తరగతి టికెట్ ఉన్న ఆమె పొరపాటున మొదటి తరగతి బోగీలో ఎక్కిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.
బోగీలో ఉన్న టికెట్ ఇన్స్పెక్టర్ తన అత్తగారిని టికెట్ చూపించమని అడిగారని, ఆమె రెండో తరగతి టికెట్తో ప్రయాణిస్తున్నట్లు గుర్తించారని, ఆ తర్వాత ఆమెను మీరా రోడ్డు స్టేషన్లో రైల్లోనుంచి దింపేసి టికెట్ చెకింగ్ స్ట్ఫారూమ్కు తీసుకెళ్లరని సదరు మహిళ అల్లుడు చెప్పాడు.
ఫైన్ కట్టమని అడగడంతో తన దగ్గర 25 రూపాయలకు మించి లేవని ఆమె చెప్పిందని, దీంతో ఆమె అబద్ధం చెబుతోందని భావించిన మహిళా టీసీలు ఆమెను నోటికొచ్చినట్లుగా తిట్టడమే కాక బలవంతంగా బట్టలూడదీయించారని ఆరోపించాడు.
అధికారులను తాత్కాలికంగా సస్పెండ్ చేసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదని, ఆ ఇద్దరు మహిళా టీసీలపై కఠిన చర్య తీసుకోవాలని అతను డిమాండ్ చేశాడు. అయితే ప్రాథమిక దర్యాప్తులో వృద్ధురాలిని బలవంతంగా బట్టలూడదీయమని అడిగినట్లు తేలినందున వారిని సస్పెండ్ చేశామని, పూర్తి దర్యాప్తు తర్వాత వారు తప్పు చేసినట్లు తేలితే శిక్షిస్తామని శైలేంద్ర కుమార్ చెప్పారు.