ఆ ప్యూన్ కోటీశ్వరుడు: ఆరు భవనాలు, 2లగ్జరీ కార్లు..!
గ్వాలియర్: ప్యూన్ ఉద్యోగం చేస్తున్నాడంటే ఏదో సాదా సీదాగా జీవనం సాగిస్తున్నాడనుకుంటాం. కానీ ఈ ప్యూన్ మాత్రం 30ఏళ్లుగా అదే ఉద్యోగం చేసుకుంటూ కోటీశ్వరుడయ్యాడు. రెండు లగ్జరీ కార్లను కూడా కొన్నాడు. ఆయనకు ఓ డుప్లెక్స్ ఇళ్లుతోపాటు మరో ఐదు భవనాలు ఉన్నాయి. ఇదంతా ఓ వ్యక్తి ఫిర్యాదుతో ఏసిబి శాఖ అధికారులు చేసిన దాడుల్లో వెల్లడైంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ నగరంలో కుల్దీప్ యాదవ్ అనే వ్యక్తి 1983 నుంచి ఓ సహకార బ్యాంకులో ప్యూన్గా పని చేస్తున్నాడు. అప్పటి నుంచి ప్రమోషన్లు కూడా ఏమి రాలేదు. ఎప్పుడూ నోరెత్తకుండా ఉండటంతో అంత ఆస్తి ఉందని ఎవరూ ఊహించలేదు.
కాగా, ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో మంగళవారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో లోకాయుక్తా, ఏసిబి అధికారులు, పోలీసులు కులదీప్ ఇళ్లల్లో సోదాలు మొదలుపెట్టారు. ఇప్పటి వరకు రూ. 3 కోట్ల రూపాయల ఆస్తులు బయటపడ్డాయి. సోదాల్లో రెండు లగ్జరీ కార్లు, ఆరు భారీ భవంతులు, నగలు, నగదు, బ్యాంక్ లాకర్లు అధికారులు గుర్తించారు.
రాత్రికి సోదాలు పూర్తయ్యేసరికి ఆస్తుల విలువ రూ. 7 వరకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అతని నెల జీతం రూ. 20వేల కంటే ఎక్కువగా ఉండదని, ఈ జీతంతో 30ఏళ్లలో మహా అయితే రూ. 15-17 లక్షలు మాత్రమే సంపాదించాలని ఓ అధికారి వ్యాఖ్యానించారు. కానీ ఏకంగా ఏడు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయనుకుంటేనే అధికారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అవినీతికి పాల్పడే ఇన్ని ఆస్తులు కూడబెట్టి ఉంటాడని అధికారులు అభిప్రాయపడ్డారు.