మా అభ్యర్థికే ఓటు, లేదంటే నీళ్లు కట్: అజిత్ పవార్!
ముంబై: తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయకుంటే గ్రామానికి నీళ్లు రాకుండా చేస్తామని ప్రజలను బెదిరింపులకు గురి చేశాడని మహారాష్ట్ర డిప్యూటీ సిఎం అజిత్ పవార్పై ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సురేష్ ఖోప్డె ఫిర్యాదు చేశారు. తమ పార్టీ అభ్యర్థి, కజిన్ సుప్రియా సూలేకు ఓటు వేయాలని లేదంటే బారమతి గ్రామానికి తాగునీరు రాకుండా చేస్తామని అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను కూడా ఆయన వెల్లడించారు.
వీడియో అంతగా స్పష్టత లేకపోయినప్పటికీ ఆడియో మాత్రం స్పష్టంగా ఉంది. అజిత్ పవార్ వ్యాఖ్యలపై తాను బరామతి గ్రామస్తులతో మాట్లాడినట్లు సురేష్ తెలిపారు. అజిత్ పవార్పై ఫిర్యాదు చేసేందుకు పలువురు ముందుకు వచ్చారని ఆయన చెప్పారు.
సిఎన్ఎన్-ఐబిఎన్ కథనం ప్రకారం.. 50 నుంచి 60 మంది మద్దతుదారులతో కలిసి ఆ గ్రామానికి వచ్చిన అజిత్ పవార్, అక్కడ ర్యాలీ నిర్వహించారు. తమ అభ్యర్థికి ఓటు వేయకుంటే నీళ్లు రాకుండా చేస్తామని బెదిరింపులకు గురి చేశారు.
ఓ భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకుడు కూడా అజిత్ పవార్పై ఫిర్యాదు చేసినట్లు సురేష్ ఖోప్డె తెలిపారు. తాను ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించారనీ, సరైన చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చినట్లు సురేష్ ఖోప్డె చెప్పారు.