24ఏళ్ల తర్వాత ఒక్కటైన మాజీ సిఎంలు లాలూ, నితీశ్
పాట్నా: సుమారు 24ఏళ్ల తర్వాత రాజకీయ ప్రత్యర్థులుగా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్న బీహార్ మాజీ ముఖ్యమంత్రులు నితీశ్ కుమార్, లాల్ ప్రసాద్ యాదవ్ కలుసుకున్నారు. ఒకే వేదికను పంచుకుని కౌగిలించుకున్నారు. అభినందనలు తెలుపుకుంటూ నవ్వులూ చిందించారు. ఇప్పటి వరకు ఒకరంటే ఒకరికి పడదు.. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండటంతో భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనేందుకు వీరిద్దరూ మిత్రులవుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఆగస్టు 21న రాష్ట్రంలో జరగనున్న 10 నియోజకవర్గాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వీరిద్ధరూ ఒకే వేదికను పంచుకున్నారు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏలో 17ఏళ్ల పాటు భాగస్వామిగా ఉన్న జెడియు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ముందు ఆ కూటమి నుంచి బయటికి వచ్చింది. కాగా, ప్రస్తుతం జెడియు పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతా దళ్, కాంగ్రెస్ పార్టీలతో కలిసివెళుతున్నారు.
ఇటీవల జరిగిన లోకసభ ఎన్నికల్లో బీహార్లో ఉన్న మొత్తం 40 స్థానాలకు గానూ బిజెపి ఏకంగా 31 స్థానాలు గెలుచుకుంది. దీంతో మనస్తాపానికి గురైన నితీశ్ కుమార్ తన ముఖ్యమంత్రి పదవిని వదులుకున్నారు. తమ పార్టీలకు పూర్వ వైభవం రావాలంటే కలిసే పోటీ చేయాలనుకున్నారో ఏమో గానీ బద్దశత్రువులైన ఈ మాజీ సిఎంలు.. 1990 తర్వాత మొదటిసారి కలిశారు.
త్వరలో బీహార్లో జరుగనున్న 10 అసెంబ్లీ ఉప ఎన్నికలలో ఆర్డేడి, జెడియు తలో నాలుగు స్థానాలకు, కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నాయి. ఈ మేరకు మూడు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో బిజెపిని ఎదుర్కొనేందుకే ఈ మూడు పార్టీలు ఏకమైనట్లు తెలుస్తోంది. ఈ పార్టీల కలయిక పట్ల స్పందించిన రాష్ట్ర బిజెపి... రాజకీయ మనుగడ కోసమే వీరందరూ ఒక్కటయ్యారని పేర్కొంది.