జయకు బెయిలివ్వాలని ఢిల్లీలో ఎంపీల నిరాహార దీక్ష
న్యూఢిల్లీ: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు న్యాయం చేయాలంటూ పార్లమెంట్ ప్రాంగణంలోని జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట ఆ పార్టీకి చెందిన ఎంపీలు గురువారం నిరాహార దీక్షకు దిగారు. చట్టప్రకారం వెంటనే ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని అన్నాడీఎంకే పార్లమెంటరీ నాయకుడు పీ వేణుగోపాల్ డిమాండ్ చేశారు.
పార్లమెంటులోని గాంధీ విగ్రహం ఎదుట అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఎంపీలు అందరూ దీక్షకు దిగారు. ఎంపీలు ఉదయం పది గంటలకు తమ దీక్షను ప్రారంభించారు. వారు సాయంత్రం ఐదు గంటల వరకు దీక్ష చేయనున్నారు.
జయలలిత బెయిల్ విషయంలో ఆలస్యం ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు. చట్ట ప్రకారం ఆమెకు వెంటనే బెయిల్ ఇవ్వాలన్నారు. తమ అధినేత్రికి బెయిల్ ఇచ్చే విషయంలో ఆలస్యం జరుగుతోందని, దీనిని అందరికీ చెప్పే ఉద్దేశ్యంలో భాగంగానే నిరాహార దీక్షకు దిగినట్లు వేణుగోపాల్ చెప్పారు.
కాగా, అక్రమాస్తుల కేసులో జయలలిత బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్న విషయం తెలిసిందే. జయలలితను విడుదల చేయాలంటూ తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు, అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు ధర్నాకు దిగుతున్న విషయం తెలిసిందే.