చిదంబరం మెడకు ఎయిర్సెల్ మాక్సిస్ ఉచ్చు?
న్యూఢిల్లీ: ఎయిర్ సెల్ మాక్సిస్ కుంభకోణం కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం మెడకు చుట్టుకుంటోంది. ఒప్పదంలో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చారని కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ గుర్తించినట్లుగా సమాచారం. దీనిపై చిదంబరాన్ని సీబీఐ అధికారులు పశ్నించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.
మాక్సిస్ అనుబంధం సంస్థ అయిన గ్లోబెల్ కమ్యూనికేషన్ సర్వీసెస్ రూ. 4,866 కోట్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పొందేందుకు 2006లో అనుమతి లభించింది. విదేశీ పెట్టుబడుల ప్రొత్సాహక బోర్డు ఎఫ్ఐవివి అభ్యర్థనపై ఆర్థిక మంత్రిగా చిదంబరం అనుమతులు ఇచ్చారు. అలా అనుమతులు ఇవ్వడానికి దారి తీసిన పరిస్థితులపై ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నట్లు ప్రత్యేక కోర్టుకు సీబీఐ తెలిపింది.
గరిష్టంగా రూ. 600 కోట్లు విలువైన ఎఫ్డీఐలకు మాత్రమే అనుమతులు ఇచ్చే అధికారం కేంద్ర ఆర్థికమంత్రికి ఉంటుందని సీబీఐ గుర్తు చేసింది. అంతకు మించి పెట్టుబడులను ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించవలసి ఉంటుందని సీబీఐ పేర్కొంది.
కాగా ఎయిర్సెల్ మాక్సిస్ ఒప్పందానికి అనుమతుల విషయంలో నిబంధనల ప్రకారమే నడుచుకున్నానని చిదంబరం స్పష్టం చేశారు. ఎయిర్సెల్ మాక్సిస్ ఒప్పందం కేసులో ఇప్పటి వరకు టెలీకాం మాజీ మంత్రి దయానిధి మారన్ ఆయన సోదరుడు కళానిధి మారెన్ తదితరులపై సీబీఐ ఛార్జి షీటు దాఖలు చేసింది.