కాంగ్రెస్ లేని దేశం, ఐక్యమత్యంగా నిలవాలన్నఅమిత్ షా
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ - శివ సేన సీట్ల సర్దుబాటు విషయమై స్పష్టత రావడం లేదు. ఈ విషయంపై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆత్మగౌరవాన్ని బలిపెట్టి తాము పొత్తుల కోసం వెళ్లమని మహారాష్ట్ర కోల్హాపూర్లో కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.
పదహేనేళ్లుగా మహారాష్ట్రలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ను అధికారంలోకి రాకుండా చేయాలంటే బీజేపీ-శివసేన ఐక్యమత్యంగా నిలవాలని ఆయన అన్నారు. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ బీజేపీ-శివసేనకు అనుకూలంగా ఉన్నాయని ఆయన గుర్తుచేశారు.
విమానంలో ముంబై నుంచి కొల్హాపూర్ వచ్చేటప్పుడు కూడా తాను బేజేపీ నాయకులు దేవేంద్ర ఫఢ్నవిస్, వినోద తవాడేలకు సీట్ల సర్దుబాటు విషయాన్ని త్వరగా తేల్చాలని చెప్పానన్నారు. బీజేపీ పొత్తు కోసం గట్టిగా ప్రయత్సిస్తున్నా.. శివసేన నుంచి సరైన స్పందన రావడం లేదని వాళ్లు అన్నారని తెలిపారు.
భారతీయ జనతా పార్టీ - శివ సేన రెండు పార్టీలు కూడా ముందుకు వచ్చి సీట్ల సర్దుబాటుపై స్పష్టతకు రావాలన్నారు. సీఎం పీఠంపై కన్నేసిన రెండు పార్టీలూ పొత్తుల్లో అధిక వాటా పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి. 'బీజేపీ - శివసేన పార్టీల మధ్య బంధం ధృడమైనదని, ఐతే మహారాష్ట్ర ముఖ్యమంత్రిని నిర్ణయించేది మాత్రమే తమ పార్టీయే' అని శివసేన పార్టీ లీడర్ సంజయ్ రౌత్ అన్నారు. సీట్ల సర్దుబాటు విషయంలో భారతీయ జనాతా పార్టీపై శివసేన ఒత్తిడి తెస్తుందన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. అలాంటిదేమీ లేదని కొట్టి పారేశారు.
"పొత్తులు కుదిరేటప్పుడు ఇలాంటివి సర్వ సాధారణం. జాతీయ పార్టీ అయిన బీజేపీ ఆ పార్టీ కార్యకర్తల మనోభీష్టం మేరకు ఎక్కువ సీట్లను అడగొచ్చని అన్నారు. కానీ మహారాష్ట్రలో శివ సేన ఎక్కువ సీట్లలో పోటీకి దిగుతుంది" అని అన్నారు. "మొదటి నుంచి కూడా ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుంది. మా కూటమి భావజాలంతో కూడుకోని ఉంది" అని అన్నారు.
చెరి సగం సీట్లలో పోటీ చేయాలని బీజేపీ పట్టుబడుతుండగా, శివసేన దీనికి ససేమిరా అంటోంది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ సీట్లుండగా చెరి 135 సీట్లలో పోటీ చేసి మిగిలిన 18 సీట్లు ఇతర మిత్రపక్షాలకు వదలి పెడదామంటూ బీజేపీ చెబుతోంది. అయితే, 155 సీట్లకు తగ్గేది లేదని శివసేన అంటోంది.
2009 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన 160 సీట్లకు పోటీ చేసి 44 గెల్చుకోగా, బీజేపీ కేవలం 119 సీట్లకు పోటీ చేసినా, 46 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లోనూ బీజేపీ 23 సీట్లు గెల్చుకోగా, శివసేన 18 సీట్లు మాత్రమే గెల్చుకుంది.