జయపై విజయశాంతి, అమ్మా.. పోలీసు సూసైడ్యత్నం
బెంగళూరు/చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత త్వరలో విడుదలవుతారని తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకురాలు, మాజీ ఎంపీ, ప్రముఖ నటి విజయశాంతి ఆకాంక్షించారు. జయలలిత జైలు నుండి మరింత శక్తితో బయటకు వస్తారని, రాష్ట్రాన్ని పాలిస్తారన్నారు.
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
జయలలితకు నాలుగేళ్ల జైలు శిక్ష పడిన నేపథ్యంలో ఇప్పటికే పలువురు మృత్యువాత పడ్డ విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం చెన్నైలోని తమిళనాడు డీజీపీ కార్యాలయం ముందు ఆ రాష్ట్ర పోలీసు విభాగానికి చెందిన వేల్ మురుగన్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేశాడు.
అయితే తక్షణమే అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని మైలాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. తేని సమీపంలోని ఒడైపట్టై పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న వేల్ మురుగన్ మంగళవారం ఉదయం కిరోసిన్ డబ్బా పట్టుకొని నేరుగా డీజీపీ కార్యాలయానికి చేరుకున్నారు.
కార్యాలయం ముందు ఒక్కసారిగా ఒంటిపై కిరోసిన్ పోసుకున్న వేల్ మురుగన్ అమ్మా అంటూ జయలలిత పేరును పెద్దగా పలుకుతూ ఒంటికి నిప్పంటించుకునేందుకు యత్నించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అతడి ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్నారు.