కెసిఆర్కు కళ్లెం వేయండి: కేంద్రానికి ఎపి మంత్రుల మొర
న్యూఢిల్లీ: ఫీజు రియింబర్స్మెంట్పై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు కేంద్రానికి పిర్యాదు చేశారు ఏళ్ల తరబడి తెలంగాణలో ఉంటున్న ఇతర రాష్ట్రాల వారికి తీవ్ర అన్యాయం జరిగే విధంగా తెరాస ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై న్యాయ పోరాటం చేస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రులు చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తిని, పార్లమెంట్ ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లును అపహాస్యం చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావును నియంత్రించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని వారు కేంద్రాన్ని కోరారు.
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగించే విధంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఉత్పన్నమవుతున్న సమస్యలపై కేంద్రంతో చర్చించేందుకు వచ్చిన ఎపి మంత్రుల బృందం హోం మంత్రి రాజ్నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు, మానవ వనరుల అభివృద్ధి మంత్రి స్మృతి ఇరానీలతో సమావేశమైంది.
ఈ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వ తీరుపై రాజ్నాథ్ సింగ్ తమతో చర్చించిన తర్వాత కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామితో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవలసిందిగా ఆదేశించినట్లు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం దేశంలో అంతర్భాగం కాదన్నట్టు కెసిఆర్ వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.
తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ పరిధికి లోబడి వ్యవహరించాలని, అంతే తప్ప తెలంగాణకు స్వయం ప్రతిపత్తి లేదనే వాస్తవాన్ని కెసిఆర్ గ్రహించాలని ఆయన హితవు పలికారు. ప్రజల స్థానికతను నిర్ధారించడానికి 1956వ సంవత్సరాన్ని కటాఫ్గా నిర్ణయించే అధికారాన్ని కెసిఆర్కు ఎవరిచ్చారని గంటా ప్రశ్నించారు. విద్యార్థులకు బోధనా రుసుములు చెల్లించేందుకు అమలు చేయతలపెట్టిన ఈ ప్రామాణికత నెమ్మదిగా ప్రతి రంగానికి విస్తరించే అవకాశాలున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
స్థానికేతరులైన ఆంధ్ర విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ చేయరాదన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం అసలు సమస్యే కాదని, ఆంధ్ర విద్యార్థుల ఫీజులను చెల్లించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారని, అయితే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం వల్ల ఆ ప్రాంతంలో స్థిరపడిన ఇతర రాష్ట్రాల విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుందని గంటా ఆందోళన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రుల ఆరోపణలను తెలంగాణ పార్లమెంటు సభ్యులు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రులు, టిడిపి, బిజెపి ఎంపీలు చేసిన ఫిర్యాదులో ఏమాత్రం నిజం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు చెప్పారు.
కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీలతో బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి వర్గం సమావేశమైన తర్వాత తెరాస ఎంపీలు జితేందర్రెడ్డి, వినోద్ కుమార్, నర్సయ్య గౌడ్, సుమన్ విశే్వశ్వర్రెడ్డి, సీతారాం నాయక్ కూడా భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వంపై ఆంధ్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు నిరాధామైన ఆరోపణలు చేశారని, వాస్తవాలను తెలుసుకున్న తర్వాతే తదుపరి చర్యలు తీసుకోవాలని వారు కేంద్ర మంత్రులను కోరారు.