మోడీ ఇంటి వద్ద చీపురు పట్టిన కేజ్రీవాల్, డ్రెయినేజ్ క్లీన్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు స్వచ్ఛ భారత్లో పాల్గొంటానని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు. నరేంద్ర మోడీ వాల్మీకీ సదన్లో స్వచ్ఛ భారత్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ మాత్రం రేస్ కోర్సు రోడ్డులోని ప్రధాని నరేంద్ర మోడీ ఉండే వీధుల్లో చీపురు పట్టి శుభ్రం చేశారు.
అనంతరం అరవింద్ కేజ్రీవాల్ తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి బీఆర్ క్యాంప్కు వెళ్లారు. అక్కడ సఫాయి కార్మికులతో కలిసి పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ కేజ్రీవాల్ డ్రెయినేజీని శుభ్రం చేశారు.
ప్రతి ఢిల్లీవాసీ కూడా స్వచ్చ భారత్ కార్యక్రమంలో పాల్గొనాలని ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ పిలుపునిచ్చింది. వారు పారిశుభ్రత కార్మికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు అరవింద్ కేజ్రీవాల్ గాంధీ జయంతి సందర్భంగా విషెస్ తెలిపారు. లాల్ బహదూర్ శాస్త్రీకి, మహాత్ముడికి నివాళులు అర్పించారు.