కొట్టిన వ్యక్తిని కల్సిన కేజ్రీవాల్, ఆటో డ్రైవర్ క్షమాపణ
న్యూఢిల్లీ: తన పైన దాడి చేసిన ఆటో డ్రైవర్ను ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం కలుసుకున్నారు. కేజ్రీవాల్ ఆటో డ్రైవర్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. దాడికి పాల్పడిన ఆటో డ్రైవర్.. కేజ్రీవాల్కు క్షమాపణలు చెప్పారు.
తాను ఉద్దేశ్య పూర్వకంగా దాడి చేయలేదని, పొరపాటు జరిగిందని, అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారని, కానీ తమ సమస్యలు పరిష్కారం కానందునే ఆగ్రహంతో దాడి చేసినట్లు చెప్పారు. తమ పార్టీ కార్యకర్తల దాడిలో ఆటో డ్రైవర్ గాయపడ్డందుకు కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనను పరామర్శించి ధైర్యం చెప్పారు.
కాగా, లాలీ అనే ఆటో డ్రైవర్ మొదటి కేజ్రీవాల్కు దండ వేసి ఆ తరువాత ఆయన చెంపపై కొట్టాడు. అక్కడే ఉన్న ఎఎఫి కార్యకర్తలు ఆటో డ్రైవర్పై ఎదురు దాడికి దిగారు. దాడిలో కేజ్రీవాల్ కంటికి దెబ్బతగలడంతో పాటు కళ్లజోడు కింద పడిందని ఆప్ నేత మనీష్ సిసోడియా తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీలను కేజ్రీవాల్ నిలబెట్టుకోలేకపోయారని 38 ఏళ్ళ ఆటో డ్రైవర్ ఆరోపించాడు.
వాయువ్య ఢిల్లీలోని సుల్తాన్పురి ప్రాంతంలో రోడ్ షో నిర్వహిస్తుండగా కేజ్రీవాల్పై ఓ ఆటో డ్రైవర్ చేయి చేసుకున్నాడు. దీనిపై కేజ్రీవాల్ స్పందించారు. తనను ఎంతగా కొట్టాలో అంతగా కొట్టండంటూ విరుచుకుపడ్డారు. ఎవరు ఎన్నిసార్లు చేయి చేసుకున్నా తిరగబడేది లేదని స్పష్టం చేశారు.