బెంగళూర్ రేప్: స్కూల్ చైర్మన్ అరెస్టు, ఆందోళనలు
బెంగళూర్: ఆరేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం కేసులో పోలీసులు పాఠశాల చైర్మన్ను బుధవారంనాడు అరెస్టు చేశారు. ఈ నెలారంభంలో విబ్జియార్ పాఠశాలలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై బెంగళూర్లో రోజు రోజుకూ ఆందోళనలు పెరుగుతున్నాయి.
నిందితులను కాపాడుతున్నారంటూ ఆందోళనకారులు పాఠశాల యాజమాన్యంపై విరుచుకుపడుతున్నారు. బుధవారం కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. దారుణమైన అత్యాచార సంఘటనపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని ఆందోళనకారులు విమర్శిస్తున్నారు.
కాగా, ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలను తెరవాలని డిమాండ్ చేస్తున్నారు. తమ పిల్లలు చదువు కొనసాగడానికి పాఠశాలను తెరవాలని అవసరం ఉందని వారంటున్నారు. పాఠశాల ప్రారంభమైనప్పటి నుంచే యాజమాన్యం పలు ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఆ పాఠశాల 2007 జూన్లో ప్రారంభమైంది. ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ స్కూల్గా దాన్ని ప్రకటించారు. దాంతో తల్లిదండ్రులు పెద్ద యెత్తున తమ పిల్లలను చేర్పించారు. దానికి ఐసిఎస్ఇ స్కూల్గా వచ్చే ఏడాది నుంచి నడపడానికి మాత్రమే అనుమతి ఉందని టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది.