నా హత్యకు కుట్ర: మమత, ప్రజల కోసం మళ్లీ పుడతా..
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని మాల్డాలోని తన హోటల్లో అగ్నిప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండవచ్చన్న వాదనను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తోసిపుచ్చారు. తన హత్యకు కుట్ర జరిగిందని ఆమె ఆరోపించారు. అంతేకాదు ఒక వేళ తాను మరణిస్తే మళ్లీ ప్రజల మధ్యే పుడతానని కూడా ఆమె అన్నారు. శుక్రవారం భీర్భుమ్ జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మమత మాట్లాడారు.
‘బెంగాల్ బాగుండడం వీళ్లకు ఇష్టం లేదు. నన్ను హత్య చేసిన తర్వాత అది షార్ట్ సర్క్యూట్ అని, ప్రమాదవశాత్తు జరిగిన మరణమని చెప్పి ఉండే వారు. అలాంటి కుట్ర కొనసాగుతోంది' అని మమత అన్నారు. గురువారం తన హోటల్ గదిలో అగ్నిప్రమాదం కారణంగా అస్వస్థతకు లోనైన మమత శుక్రవారం తిరిగి తన ఎన్నికల ప్రచారాన్ని మామూలుగా కొనసాగించారు. ‘మీరెంతగా నన్ను అప్రతిష్ఠ పాలు చేయాలని, చంపాలని అనుకుంటారో నేను మళ్లీ ఈ ప్రజల మధ్యనే జన్మిస్తాననే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి' అని తనపై కుట్ర పన్నుతున్న వారినుద్దేశించి ఆమె పరోక్షంగా అన్నారు.
అంతకుముందు ప్రచారం కోసం మాల్డానుంచి హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లడానికి ముందు మమత మీడియాతో మాట్లాడుతూ.. అగ్నిప్రమాదం కారణంగా వ్యాపించిన పొగకు తనకు ఊపిరాడకపోవడంతో గురువారం రాత్రి వైద్యులు, ఆక్సిజన్, సెలైన్ ఎక్కించారని చెప్పారు. అయితే ఇది ఎన్నికల సీజన్ అయినందున తన ప్రచారాన్ని రద్దు చేసుకోలేననీ, ప్రచారం కొనసాగించక తప్పదని మమత అన్నారు.
గురువారం రాత్రి ప్రమాదానికి దారి తీసిన సంఘటనను వివరిస్తూ.. తాను వాష్ రూమ్లో ఉన్నప్పుడు పెద్ద శబ్దం వినిపించిందని, గదంతా పొగ నిండిపోయి ఏమీ కనిపించని మమత చెప్పారు. తాను వెంటనే తన సహాయకుడు జైదీప్ కోసం కేకలు వేయగా అతను వచ్చి తనకు ఒక బ్లాంకెట్ కప్పి రూమ్నుంచి బైటికి తీసుకువచ్చాడని ఆమె చెప్పారు. అది ప్రాణాంతకమైన గ్యాస్ అని, దాన్ని పీలిస్తే మనిషి చనిపోయే ప్రమాదం ఉందని అగ్నిమాపక అధికారులు తనకు చెప్పారని మమత అన్నారు.
కాగా, మరోవైపు ప్రచారం కోసం మమత వెళ్లాల్సిన సురి-బోల్పుర్ మార్గంలో ఓ కల్వర్టు కింద బాంబాలాంటి పరికరాన్ని పోలీసులు గుర్తించారు. తనిఖీల సమయంలో ఆ పరికరంతో పాటు రెండు జిలెటిన్ స్టిక్స్, రెండు డిటోనేటర్లు, 12 బ్యాటరీలు, ఛార్జర్లను పోలీసుల బృందం గుర్తించినట్లు బిర్భూం ఎస్పి ఆర్ఎం ఖాన్ తెలిపారు. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఐదుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.