యువతి దుస్తులిప్పేసి ఫొటోలు: లైంగిక వేధింపులు
కోల్కతా: ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన విశ్వభారతి విశ్వవిద్యాలయంలో ఓ యువతిపై సీనియర్ విద్యార్థుల అరాచకం వెలుగుచూసింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాంతినికేతన్లోని విశ్వభారతి విశ్వవిద్యాలయంలో ముగ్గురు సీనియర్ విద్యార్థులు తన దుస్తులు విప్పి, ఫొటోలు తీశారని.. డబ్బులు ఇవ్వకుంటే వాటిని ఇంటర్నెట్లో పెడతామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఓ విద్యార్థిని ఆరోపించింది. సిక్కింకు చెందిన ఆమె కళాభవన్లో ద్వితీయ సంవత్సరం చదువుతోంది.
ఈ విషయమై ఆమె విశ్వవిద్యాలయంలోని లైంగిక వేధింపుల వ్యతిరేక కమిటీకి ఫిర్యాదు చేసింది. తనను వాళ్లు రూ. 4వేలు చెల్లించాలని బెదిరిస్తున్నట్లు ఆ ఫిర్యాదులో యువతి పేర్కొంది. ఆ ముగ్గురు యువకుల్లో ఇద్దరు రెండో సంవత్సరం చదువుతున్నారని, మరొకరు మూడో సంవత్సరంలో ఉన్నాడని ఆమె తెలిపింది. కాగా, ఈ ముగ్గురు కూడా పరారీలో ఉన్నారు.
ఆమె ఫిర్యాదుపై స్పందించిన లైంగిక వేధింపుల వ్యతిరేక కమిటీ ఛైర్ పర్సన్ మౌసుమి భట్టాచార్య మాట్లాడుతూ.. బాధిత యువతి ఫిర్యాదు మేరకు నిందితులపై చర్యలు తీసుకునేందుకు విచారణ చేపట్టామని చెప్పారు. ఫిర్యాదుపై తాము విచారణ చేపట్టామని, అధికారులతో అత్యవసర సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని కళాభవన్ ప్రిన్సిపాల్ చెప్పారు.
కాగా, యువతి తండ్రి గురువారం శాంతినికేతన్కు వచ్చి తన కూతురుపై సాగుతున్న వేధింపులపై అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తన కూతురు పట్ల ముగ్గురు యువకులు అసభ్యంగా ప్రవర్తించారని, తమ మొబైల్ ఫోన్లతో అభ్యంతరకర ఫొటోలు తీసి వేధింపులకు గురిచేస్తున్నారని చెప్పారు. విశ్వవిద్యాలయ హాస్టల్లో ఉన్న తన కూతురును గురువారం ఆయన తన వెంట తీసుకెళ్లారు.