ఆలస్యం వద్దు, విదేశాలకు వద్దు: ఎంపీలకు మోడీ రూల్స్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులకు నిబంధనలు విధిస్తున్నారు! గుజరాత్ తరహా భారత్ అభివృద్ధిని మోడీ కోరుకుంటున్నారు. ఇందుకోసం ఆయన అహర్నిశలు పని చేస్తున్నారు. ఇందులో భాగంగా మొదట్లోనే మంత్రులకు వంద రోజుల డెడ్ లైన్ విధించారు. ఆ తర్వాత పలు నిర్ణయాలు తీసుకున్నారు.
తాజాగా పార్టీకి చెందిన ఎంపీలకు నియమ, నిబంధనలు పెట్టారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు బీజేపీ సభ్యులు విదేశాలకు ఎట్టి పరిస్థితుల్లోను వెళ్లకూడదని, పార్టీ కీలక సమావేశాలకు బీజేపీ ఎంపీలు కచ్చితంగా హాజరు కావాలని పార్టీ రూల్స్ పెట్టింది.
అంతేకాదు, పార్టీ అధికార ప్రతినిధులు కచ్చితంగా ప్రతి మంగళవారం ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో సమావేశం కావాలి. పార్టీని సంప్రదించకుండా బీజేపీ ఎంపీలు పార్లమెంట్లో ఏ రకమైన తీర్మానాలను కూడా ప్రవేశ పెట్టకూడదు. ఎంపీల పని తీరును బట్టి వారికి తదుపరి కార్యక్రమాలు అప్పజెబుతారు.
ఈ అంశం పైన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు స్పందించారు. ప్రతివారం పార్టీ సమావేశాల వివరాలను మోడీకి పంపిస్తామని, పార్టీ ఎంపీల పని తీరును ఆయన ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటారని చెప్పారు. ఎంపీల పని తీరును బట్టే వారికి తరువాతి రోజులలో ఇవ్వాల్సిన ప్రాధాన్యతపై నిర్ణయం తీసుకుంటామన్నారు.