బిజెపితో పొత్తు కొనసాగిస్తాం కానీ...: ఉద్దవ్ ధాక్రే
న్యూఢిల్లీ: అక్టోబర్లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ - శివ సేన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. రెండు తమకంటే తమకంటూ ఎక్కువ సీట్లు కావాలని డిమాండ్ చేస్తున్నాయి. మహరాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్ది పేరు అప్పుడే ప్రకటించవద్దని భాజపా అంటోంది.
ఈ విషయంలో కేంద్రమంత్రి రవశంకర్ ప్రసాద్ నేడు ఉద్దవ్ ధాక్రేను కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఉద్దవ్ ధాక్రే విలేకరులతో మాట్లాడుతూ ఇరు పార్టీల మధ్య చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని, చర్చలు ఒక కొలిక్కి వచ్చి ఓ నిర్ణయం తీసుకునే వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమన్నారు.
'మహరాష్ట్ర అసెంబ్లీలో శాసనసభ్యుల సంఖ్య మొత్తం 288. ఇందులో శివ సేన 150 సీట్లు ఇవ్వమని అడుగుతున్నామని అన్నారు. గత లోకసభ ఎన్నికల్లో బిజెపి మిషన్ 272 పేరుతో పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లగా ఇప్పుడు మేము మిషన్ 150తో ముందుకెళడంలో తప్పేంటని అన్నారు. బిజెపితో పొత్తు కేవలం పవర్ కోసం కాదని, మహరాష్ట్ర కోసం' అని అన్నారు. ఐతే బిజెపి మాత్రం చెరో 135 సీట్లలో పోటీలోకి దిగాలోనే ఆలోచనతో ఉంది.
2009 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన 160 సీట్లకు పోటీ చేసి 44 గెల్చుకోగా, బీజేపీ కేవలం 119 సీట్లకు పోటీ చేసినా, 46 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లోనూ బీజేపీ 23 సీట్లు గెల్చుకోగా, శివసేన 18 సీట్లు మాత్రమే గెల్చుకుంది. దీంతో తమ బలమే ఎక్కువన్న నిర్ధారణకు వచ్చిన బీజేపీ తమకు ఎక్కువ సీట్లు కావాలంటోంది. ఇటీవలే లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ ముఖం చూసి మార్పు కోసం ఓటేశారన్న ఉద్ధవ్, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడటంతో బిజెపి-శివసేన కూటమికి ప్రధాన్యత సంతరించుకుంది.