రాజ్యసభలో ఎన్టీఆర్ రగడ, బ్లాక్ మనీపై 250 మంది ఒప్పుకున్నారు!
న్యూఢిల్లీ: రాజ్యసభ ప్రారంభమైన కాసేపటికే గురువారం వాయిదా పడింది. శంషాబాద్ విమానాశ్రయం దేశీయ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో రాజ్యసభ రెండుసార్లు వాయిదా పడింది. చైర్మన్ సభను రెండు గంటల వరకు వాయిదా వేశారు. కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు దూసుకొచ్చారు.
తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యుడు కే కేశవ రావు మాట్లాడుతూ... తెలంగాణ ప్రజల సెంటిమెంటును దెబ్బతీయవద్దన్నారు. శంషాబాద్ విమానాశ్రయ డొమెస్టిక్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టడం సరికాదన్నారు.
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అన్ని రాజకీయపక్షాలు సహకరిస్తే సభ సజావుగా సాగుతుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మీడియాతో అన్నారు. ఈ సమావేశాల్లో మొత్తం 37 బిల్లులపై చర్చ జరుగుతుందని తెలిపారు. బుధవారం కేవలం మూడు బిల్లులు మాత్రమే ఆమోదం పొందాయన్నారు. సభా సమయం తక్కువగా ఉన్నందున విపక్షాలు సహకరించాలన్నారు.
250 మంది ఖాతాదారులను గుర్తించాం: జైట్లీ
విదేశీ బ్యాంకుల్లో నల్లధనం ఖాతాలున్న వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందని, ఇంతవరకు 250 మంది ఖాతాదారులను గుర్తించి కేసులు నమోదు చేస్తున్నామని, తప్పు చేసిన వారిని శిక్షిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు.
విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని ఎప్పుటిలోగా తెస్తారన్న ప్రతిపక్షాల ప్రశ్నపై జైట్లీ స్పందించారు. ఎన్డీయే ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం లేదని, నల్లధనం విషయంలో చిత్తశుద్ధి చూపడం లేదంటూ కాంగ్రెస్, వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్, ఎస్పీ, జెడి (యు) తదితర ప్రతిపక్షాలు సభ నుంచి బుధవారం వాకౌట్ చేశాయి.
పార్లమెంటు ఉభయ సభల్లో నల్లధనంపై బుధవారం కొన్ని గంటలపాటు చర్చ జరిగింది. రాజ్యసభలో జరిగిన చర్చకు జైట్లీ సమాధానమిచ్చారు. మమ్మల్ని విమర్శించే అధికారం విపక్షాలకు ఉందని, అయితే నల్లధనాన్ని స్వదేశానికి ఎలా తీసుకురావాలనేది ప్రతిపక్షం అర్థం చేసుకోవాలన్నారు. యూపీఏ సంకీర్ణ ప్రభుత్వం నల్లధనాన్ని తెచ్చేందుకు ఒక పద్ధతిలో వ్యవహరించిందన్నారు.
భారత ఆర్థిక వ్యవస్థను నల్లధనం దెబ్బ తీస్తోందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిందన్నారు. సుప్రీం ఆదేశాల మేరకే నల్లధనాన్ని స్వదేశానికి తెచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. తమ ప్రభుత్వం మొదటి మంత్రివర్గ సమావేశంలోనే సుప్రీం సూచించిన విధంగా నల్లధనంపై సిట్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని, సిట్కు ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం అందించామన్నారు.
627 ఖాతాలు హెచ్ఎస్బిసికి, లించెస్టైన్ ఖాతాలు 28 ఉన్నాయన్నారు. వీటిలో కొందరు మరణించారని, కొందరు ఎన్నారైలని అన్నారు. హెచ్ఎస్బిసి ఖాతాల విషయంలో కొంత సమాచారమే వచ్చిందని, ఇవి 2005-07 మధ్య కాలానికి సంబంధించిన ఖాతాలుగా వివరించారు. ఖాతాల వివరాలు వెల్లడించేందుకు స్విట్జర్లాండ్ ప్రభుత్వం మొదట నిరాకరించిందని, చర్చలు జరిపి సమాచారం వచ్చేలా చేయగలిగామన్నారు.
627 ఖాతాలకు సంబంధించిన 427మంది ఖాతాదారులను గుర్తించామని, వారిని పిలిచి మాట్లాడుతున్నామన్నారు. 250మంది తమకు విదేశీ ఖాతాలున్నట్టు ఒప్పుకున్నారని జైట్లీ తెలిపారు. ఖాతాల వివరాలు వెల్లడిస్తే జాగ్రత్త పడతారు కనుకే వెల్లడించటం లేదన్నారు. సరైన సమయంలో ఖాతాలకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.