విడాకులు ఇవ్వలేదని భార్యను కత్తితో పొడిచి చంపాడు
పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలు పిఎస్ జయసువాసిని(29), నిందితుడు వివి సంతోష్ కుమార్ ఇద్దరు దంపతులు. వారికి 2007, ఆగస్టు 27న వివాహం జరిగింది. పెళ్లి సందర్భంగా రూ. 30లక్షలు కట్నంగా బాధితురాలి తల్లిదండ్రులు వరుడికి అందజేశారు. సంతోష్ భవన నిర్మాణ కాంట్రాక్టర్ పని చేస్తున్నాడు. కాగా, అత్తాగారింటి వేధింపులతో మూడేళ్ల క్రితం జయసువాసిన తల్లిగారింటికి వెళ్లిపోయింది. తనతో కలిసి జీవించలేనని సంతోష్ కూడా తేల్చి చెప్పేశాడు.
అంతేగాక తనకు విడాకులు కావాలని సంతోష్ ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చాడు. అయితే అందుకు జయసువాసిని అంగీకరించలేదు. ఈ ఇద్దరు దంపతులకు కొడుకు గౌతమ్, కూతురు కీర్తి ఉన్నారు. ఇద్దరు మూడేళ్లపైన వయస్సుగలవారు. కాగా, సోమవారం సువాసినికి భర్త సంతోష్ ఫోన్ చేసి తనతో జీవించాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. వెంటనే కోయంబత్తూరు రావాలని కోరాడు. దీంతో సోమవారం రాత్రి తన ఇద్దరు పిల్లలతో కలిసి సువాసిని కోయంబత్తూరు బయల్దేరింది.
వరతరాజపురంలోని తన అత్తగారింటికి చేరుకోగా ఆ ఇంటికి తాళం వేసి ఉంది. అక్కడికి చేరుకున్న భర్త సంతోష్.. భార్య, పిల్లలను తీసుకుని తన బంధువుల ఇంటికి చేరుకున్నాడు. అక్కడే ఇద్దరు పిల్లలను వదిలిపెట్టి సువాసినిని తీసుకుని ఒండిపూర్ బయల్దేరాడు. తనకు విడాకులు ఇవ్వాలని మళ్లీ ఆమెను కోరాడు సంతోష్. దీనికి సువాసిని ఒప్పుకోలేదు. అతనితో జీవిస్తానని చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన సంతోష్ తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెను విచక్షణా రహితంగా పొడిచాడు. తీవ్రగాయాలపాలైన సువాసిని అక్కడే ప్రాణాలు విడిచింది. కాగా, ఘటనను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతోపాటు నిందితుడ్ని పట్టుకుని వారికి అప్పగించారు.