రాజస్థాన్, గుజరాత్ల్లో బిజెపికి దెబ్బ: యుపి గాలి బుడగ
న్యూఢిల్లీ: ఉప ఎన్నికల ఫలితాలు బిజెపికి చేదు అనుభవాన్నే మిగిలించాయని చెప్పవచ్చు. నాలుగు నెలల క్రితం జరిగిన సాధారణ ఎన్నికల్లో నరేంద్ర మోడీ హవాతో దేశంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రస్తుత ఉప ఎన్నికల ఫలితాలను చూస్తే దెబ్బ తిన్నట్లు కనిపిస్తోంది. లోకసభ ఎన్నికల్లో అసాధరణంగా అత్యధిక లోకసభ స్థానాలను గెలుచుకున్న బిజెపి బలం గాలి బుడగ లాగా తేలిపోయింది. ఉత్తరప్రదేశ్లో బిజెపి పునాదిని కోల్పోతున్న సూచనలను ఈ ఫలితాలు ఇచ్చాయి. మూడు ప్రధాన రాష్ట్రాల్లోనూ బిజెపి పరిస్థితి అంత బాగా లేదని ఉప ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయి.
ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా బిజెపికి దెబ్బ తగిలింది. గుజరాత్లో 9 శాసనసభా స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా, బిజెపి మూడు స్థానాలను మాత్రమే నిలబెట్టుకోగలిగింది. మిగతా మూడు సీట్లు కాంగ్రెసు ఖాతాలో చేరాయి. సిట్టింగ్ బిజెపి శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులుగా ఎన్నిక కావడంతో 9 సీట్లు ఖాళీ అయ్యాయి. ఈ తొమ్మిది సీట్లకు కూడా అంతకు ముందు బిజెపియే ప్రాతినిధ్యం వహించింది.
కాగా, పశ్చిమ బెంగాల్లో మాత్రం బిజెపి బోణీ కొట్టింది. బషీర్హట్ సీటును గెలుచుకుంది. దేశంలోని పది రాష్ట్రాల్లోని 33 శాసనసభా స్థానాలకు ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరిగింది. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బిజెపికి ఈ ఫలితాలు ఆందోళన కలిగించేవే.
రాజస్థాన్లో ముఖ్యమంత్రి వసుంధర రాజే ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. ప్రతిపక్ష కాంగ్రెసు పార్టీ మూడు సీట్లను గెలుచకుంది. ఒక్క సీటును మాత్రమే బిజెపి నిలబెట్టుకోగలిగింది. లోకసభ ఎన్నికల్లో రాజస్థాన్లో మొత్తం 25 స్థానాలను బిజెపి గెలుచుకుంది. ప్రస్తుత ఫలితాలను చూస్తే రాజస్థాన్లో కూడా బిజెపి దెబ్బ తింటున్న సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 11 శాసనసభా స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే ఎస్పీ 9 స్థానాలను గెలుచుకుంది. బిజెపికి రెండు స్థానాలు మాత్రమే దక్కాయి. దీన్ని బట్టి లోకసభ ఎన్నికల్లో బిజెపి బలం గాలి బుడగ మాదిరిగా తేలిపోయినట్లు అనిపిస్తోంది. మొత్తం మీద, ఈ ఉప ఎన్నికల ఫలితాలు అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని బిజెపికి తెలియజేశాయి.