మోడీకి మార్కులు, బీజేపీకి హెచ్చరిక: కేసీఆర్పై ఒత్తిడి
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఉప ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి షాకిచ్చాయి. దేశవ్యాప్తంగా 3 లోకసభ, 33 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలు సార్వత్రిక ఎన్నికల్లో బోర్లాపడిన పలు పార్టీలకు ఊరటనిచ్చాయి. అదే సమయంలో బీజేపీకి ఫలితాలు నిరాశను కలిగించాయి.
ఓ వైపు ప్రధాని నరేంద్ర మోడీ పాలనకు విపక్షాల నుండే మార్కులు పడుతుండగా.. ఉప ఎన్నికల ఫలితాలు విరుద్ధంగా ఉండటంపై పలు రకాల కారణాలు చెబుతున్నారు. జమ్ము కాశ్మీర్లో వరదల అంశంపై మోడీ స్పందనను విపక్ష నేతలు కూడా కొనియాడారు. కాంగ్రెసు పార్టీ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, గులాం నబీ ఆజాద్ ప్రధాని తీరును ప్రశంసించారు. జమ్ముకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఆమ్ ఆద్మీ పార్టీ నేత కుమార్ విశ్వాస్లు కూడా మోడీకి కితాబిచ్చారు.
అలాగే, పొరుగు దేశాలతో పాటు ఇతర దేశాలతో సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు మోడీ చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసిస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం, ఇప్పటి ఉప ఎన్నికలు మాత్రం బీజేపీకి నిరాశను మిగిల్చాయి. ఉప ఎన్నికలు ఆ పార్టీకి హెచ్చరికలే అంటున్నారు. గుజరాత్, రాజస్థాన్లలో కూడా బీజేపీకి కొంత ఎదురుగాలి వీయడం గమనార్హం. మరోవైపు, గత ఉప ఎన్నికల ఫలితాలతో పాటు ఈ ఫలితాలు కూడా సార్వత్రిక ఎన్నికల్లో బోర్లాపడిన పలు పార్టీలకు కొత్త బలాన్నిచ్చాయి.
మోడీ హవా కారణంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో 44 స్థానాలకే పరిమితం కాగా, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్లలో బొక్క బోర్లా పడింది. అదే సమయంలో ఉత్తర ప్రదేశ్లో అధికార ఎస్పీ, ప్రధాన ప్రతిపక్షం బీఎస్పీలు కూడా తుడిచిపెట్టుకు పోయాయి. ఈ ఉప ఎన్నికలు మాత్రం సోనియా, అఖిలేష్ యాదవ్ వంటి వారికి ఊరటనిచ్చాయి.
ఇదిలా ఉండగా పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఖాతా తెరిచింది. ఇది ఆ పార్టీకి బెంగాల్లో సంతోషాన్నిచ్చే విషయమే. ఈ ఫలితాలను తాము ఊహించలేదని బీజేపీ అధికార ప్రతినిధి ముక్తార్ అబ్బాస్ నక్వీ అన్నారు. ఈ ఉప ఎన్నికల్లో స్థానిక అంశాలు ప్రభావితం చూపి ఉంటాయని ఆయన అన్నారు. ఆయా రాష్ట్రాలతో తాము చర్చిస్తామని చెప్పారు.
ఎదురులేని కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో తెరాసకు ఎదురులేకుండా పోయింది. మెదక్ పార్లమెంటు ఉప ఎన్నికల్లో బీజేపీ-తెరాసల మధ్యనే పోటీ ఉంటుందని అందరు భావించినప్పటికీ అది జరగలేదు. కాంగ్రెసు పార్టీ రెండో స్థానంలో నిలిచింది. తెరాసకు గట్టి పోటీ ఇస్తారని భావించిన బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఆయనను సమైక్యవాదిగా చూపించడంలో తెరాస విజయవంతమైనందునే ఆయన దారుణంగా ఓడిపోయారని అంటున్నారు.
కేసీఆర్ సెప్టెంబర్ చిక్కు, ఒత్తిడి
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన 'సెప్టెంబర్ 17' ఒత్తిడి పెరుగుతోంది. సెప్టెంబర్ 17ను విలీనం/విమోచన దినోత్సవంగా ప్రకటించాలని బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాలతో పాటు తెలంగాణ జేఏసీ కూడా డిమాండ్ చేస్తోంది. విలీన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తే బాగుంటేదని కోదండరామ్ అభిప్రాయపడ్డారు.
విలీన దినానికి మతతత్వ రంగును పులమొద్దని, నిజాం నిరంకుశం పైన తెలంగాణ ప్రజలు తిరుగుబాటు చేశారని చెప్పారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ గోల్కొండ కోట పైన జాతీయ జెండా ఎగురవేయాలని భావిస్తోంది. ఇందుకు ప్రభుత్వం కూడా వ్యతిరేకత చూపదని భావిస్తున్నారు.
బాపూ ఘాట్ నుండి గోల్కొండ కోట వరకు ర్యాలీగా వెళ్లి జాతీయ జెండాను ఎగురవేయాలని చూస్తున్నారు. మజ్లిస్ ఒత్తిడి వల్లే ప్రభుత్వం విమోచన దినాన్ని నిర్వహించడం లేదని బీజేపీ ఆరోపిస్తోంది. తెరాస భవనంలో బుధవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు నాయిని నర్సింహా రెడ్డి జాతీయ జెండాను ఎగురవేయనున్నారు.