కెసిఆర్పై ఒత్తిడి: రాజధాని శాంతిభద్రతలపై కేంద్రం లేఖ
న్యూఢిల్లీ: రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్కు సంబంధించిన శాంతి భద్రతల అధికారాలను గవర్నర్కు అప్పగించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతల అధికారాలు గవర్నర్కు అప్పగించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్రం హోంశాఖ కార్యదర్శి మంగళవారం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు లేఖ రాసినట్లు తెలిసింది. ఇదే సమాచారాన్ని గవర్నర్ నరసింహన్కు పంపినట్లు తెలుస్తోంది. ఆ రకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుపై కేంద్రం ఒత్తిడి పెంచుతోంది.
విభజన చట్టం ప్రకారం వివిధ అంశాలపై గవర్నర్కు అధికారాలు అప్పగించాలంటూ కేంద్రం ఇదివరకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బిజినెస్ రూల్స్లో సవరణలు ప్రతిపాదించింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వ స్పందన కూడా కోరింది. అయితే ఉమ్మడి పోలీసింగ్కు తెలంగాణ ప్రభుత్వం ఏ మాత్రం అంగీకరించలేదు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయినప్పటికీ అది తెలంగాణలో అంతర్భాగమని, ఒక రాష్ట్రం పరిధిలో మరో రాష్ట్ర పోలీసులకు అధికారాలు ఉండవని, శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలోని అంశమని స్పష్టం చేసింది.
శాంతిభద్రతలపై తెలంగాణ కేబినెట్ అభిప్రాయం తెలుసుకున్నప్పటికీ, అంతిమ నిర్ణయం మాత్రం గవర్నర్దే అని చట్టంలో ఉన్నట్లు కేంద్రం గుర్తు చేసింది. అయితే మంత్రివర్గం సలహా మేరకే గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం జవాబిచ్చింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కృష్ణారావు, రాజీవ్ శర్మలతో అనిల్ గోస్వామి సమావేశమైనప్పుడు ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. విభజన చట్టానికి అనుగుణంగా గవర్నర్ అధికారాలకు సంబంధించి నియమ నిబంధనలు రూపొందించాలని కృష్ణారావు కోరితే - ఇది సున్నితమైన అంశమని, దీనిపై ఏమీ మాట్లాడలేనని అనిల్ గోస్వామి చెప్పారు.
అయితే మంగళవారం దీనిపై తెలంగాణ సర్కారుకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. చట్టంలోని సెక్షన్ 8 కింద గవర్నర్కు ఉమ్మడి రాజధానిలో అధికారాలు ఉండాలని, శాంతిభద్రతలు, పోలీసు అధికారుల పోస్టింగ్స్కు సంబంధించి గవర్నర్ తన అధికారాలను ఉపయోగించాలని తెలంగాణ ప్రభుత్వానికీ, గవర్నర్కు కేంద్రం నిర్దేశించింది.