18గంటలు పని చేస్తున్న మోడీ: చైనా మీడియా ప్రశంస
బీజింగ్: భారత ప్రధాని నరేంద్ర మోడీపై చైనా దేశానికి చెందిన పలు మీడియా సంస్థలు ప్రశంసలతో ముంచెత్తుతున్నాయి. నరేంద్ర మోడీ పరిశుభ్రతకు, సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నాయి. కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉన్నతాధికారులతో పాటు కింది స్థాయి అధికారులు కూడా కార్యాలయాలకు సరైన సమయంలో వస్తున్నారని తెలిపింది.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లాగే ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ కూడా సైలెంటుగా ఉంటున్నారని పలు ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే నరేంద్ర మోడీ సైలెంటుగానే పని చేసుకుపోతున్నారని చైనా మీడియా ‘గ్లోబల్ టైమ్స్' మంగళవారం ప్రచురించిన తన కథనంలో పేర్కొంది. నరేంద్ర మోడీ రోజుకు 18 గంటలు పని చేస్తున్నారని, ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి ఒంటి గంట వరకు ఆయన తన విధులు నిర్వహిస్తున్నారని పేర్కొంది.
ఫైళ్లలో ఏ ఒక్కటీ పెండింగులో ఉండటానికి వీల్లేదని అధికారులకు మోడీ సర్కారు స్పష్టం చేస్తోందని వెల్లడించింది. మోడీ నాయకత్వంలో పని చేస్తున్న మంత్రులు కూడా తమ తమ కార్యాలయాలను తనిఖీ చేస్తూ.. పాత ప్రభుత్వం హయాంలో పెండింగులో ఉన్న ఫైళ్లను, ప్రస్తుత ఫైళ్లను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారని పేర్కొంది. కార్యాలయాలు శుభ్రంగా ఉంచేందుకు, అధికారులు సమయానికి వచ్చేట్లు మంత్రులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపింది.
అదే విధంగా ప్రభుత్వ అధికారులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6గంటలవరకు కార్యాలయాల్లోనే ఖచ్చితంగా ఉండేలా చేస్తున్నారని తెలిపింది. ఏవైనా పనులుంటే 6గంటల తర్వాత కూడా పని చేయిస్తున్నారని, శనివారాలు కూడా అందరూ పని చేస్తున్నారని పేర్కొంది. ఏమైనా పని మిగిలిపోతే అధికారులు తమ ఇళ్లకు ఫైళ్లు తీసుకెళ్తున్నారని వెల్లడించింది.
తమ శాఖల కార్యాలయాల్లో ఎక్కడా దుమ్ము ఉండకుండా, పాత ఫర్నీచర్ మిగలకుండా, ఫైళ్లు డెస్కుల మీద ఉండకుండా, కిళ్లీ ఉమ్మేసిన మరకలు కనపడకుండా చూసుకోవాల్సిన బాధ్యతను ఆయా శాఖల కార్యదర్శులకు మంత్రులు అప్పగించారని పేర్కొంది. చైనా కమ్యూనిస్టు పార్టీ అధికారిక పత్రిక అయిన ‘పీపుల్స్ డైలీ'కి ఇంగ్లీష్ వర్షనే ఈ ‘గ్లోబల్ టైమ్స్' పత్రిక.
ఫైళ్లను క్లియర్ చేసేందుకు ఎలక్ట్రానిక్ మార్గాన్ని ఎంచుకోవాలని అధికారులకు మోడీ సూచించినట్లు ఆ కథనం పేర్కొంది. ఫైల్స్ అన్నీ కంప్యూటరీకరణ చేయాలని ఆయన ఆదేశించినట్లు తెలిపింది. భారతదేశంలో కొలువైన కొత్త ప్రభుత్వం చర్యలను చైనా మీడియా చాలా దగ్గర్నుంచి గమనిస్తోందనడానికి ఈ కథనం నిదర్శనంగా చెప్పుకోవచ్చు.