విభజనపై మమత ఆగ్రహం, విడదీయలేరని విజయమ్మ
మనసులు విడదీయలేరు: విజయమ్మ
ప్రాంతాలను విడదీయవచ్చని కాని తెలుగువారి మనసులను మాత్రం ఎవరూ వేరూ చేయలేరని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ హైదరాబాదులో అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ శ్రేణుల కోసం నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణా కార్యక్రమంలో ఆమె ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రాంతాలకు సరిహద్దులు ఉంటాయేమో కాని మంచి పనులు చేసే వారికి ఎల్లలు ఉండవన్నారు.
రెండు ప్రాంతాల కలిసి ఉంటే అభివృద్ధి మరింతగా జరుగుతందన్నారు. నదీ జలాల వివాదాలు తలెత్తకుండా ఉంటాయని తమ పార్టీ భావించిందన్నారు. తెలుగువారికి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా తమ పార్టీ అన్ని విధాలా అండగా నిలుస్తుందన్నారు. ఈ క్రమంలో అన్ని ఎన్ని సవాళ్లు ఎదురైనా వెనకడుగేయవద్దని ఆమె ఉత్సాహపరిచారు. రాష్ట్రాన్ని విభజించడానికి కేంద్రంలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బిజెపి కుమ్మక్కై పని చేశాయన్నారు.
తమ పార్టీ ప్రజల నుంచి పుట్టిందన్నారు. పార్టీ ప్లీనరీలో పేర్కొన్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. లోకసభలో మైక్లు నిలిపేసి సీమాంధ్ర సభ్యులను బయటకు పంపించి, సభా భవనం తలుపులు మూసివేసి అప్రజాస్వామికంగా విభజన బిల్లును ఆమోదించారన్నారు.