రాజస్థాన్లో వసుంధరకు షాక్: కాంగ్రెస్కు ఊరట
న్యూఢిల్లీ: రాజస్థాన్ ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెసు పార్టీకి ఊరటనిచ్చాయి. రాష్ట్రంలో సాధారణ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన బిజెపికి ఎదురు దెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి వసుంధర రాజేకు మింగుడు పడని ఫలితాలు వచ్చాయి. రాజస్థాన్లోని నాలుగు శాసనసభా స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా కాంగ్రెసు బిజెపి సిట్టింగ్ స్థానాలను మూడింటిని తన వశం చేసుకుంది.
ఒక్క స్థానాన్ని మాత్రమే బిజెపి నిలబెట్టుకుంది. మేలోనే రాజస్థాన్ శాసనసభకు సాధారణ ఎన్నికలు జరిగాయి. కోట దక్షిణ సీటును మాత్రమే బిజెపి తిరిగి కైవసం చేసుకోగలిగింది. కాంగ్రెసు సూరజ్గంజ్, వీర్, నసీరాబాద్ స్థానాల్లో విజయ కేతనం ఎగురవేసింది.
అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెసుకు రాజస్థాన్ నుంచి తొలి శుభవార్త ఇదే. దశాబ్దం పాటు రాజస్థాన్ను పాలించిన కాంగ్రెసు గత ఎన్నికల్లో చావు దెబ్బ తిన్నది. బిజెపికి చెందిన వసుంధర రాజే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రస్తుత ఫలితాలు సంఖ్య రీత్యా బిజెపిపై పెద్దగా ప్రభావం చూపకపోయినప్పటికీ నైతికంగా దెబ్బనే.
రాజస్థాన్ కాంగ్రెసు ఇంచార్జీగా ప్రస్తుతం సచిన్ పైలట్ వ్యవహరిస్తున్నారు. ఆయన ప్రతిష్టను ఈ ఫలితాలు పెంచుతాయని చెప్పడంలో సందేహం లేదు. కాంగ్రెసు ఫలితాలు రాబోవని ప్రతి ఒక్కరూ అన్నారని, కానీ ఈ ఫలితాలు సాధించినందుకు తాను కార్యకర్తలకు అభినందనలు తెలుపుతున్నానని సచిన్ పైలట్ అన్నారు. ఈ ఫలితాలను గుణపాఠంగా తీసుకుని బిజెపి ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన అన్నారు.
ఇదిలావుంటే, సూరజ్గంజ్ ఫలితం వ్యక్తిగతంగా వసుంధర రాజేకు మింగుడు పడని విషయం. ఈ సీటులో పట్టుబట్టి మాజీ ఆరోగ్య మంత్రి దిగంబర్ సింగ్ను ఆమె పోటీకి దించారు.