రైళ్లలో నేరాల అదుపునకు చర్యలు: సదానంద (పిక్చర్స్)
హైదరాబాద్: రైళ్లలో నేరాల అదుపునకు భద్రతా సిబ్బంది అంకితభావంతో పూర్తి నిబద్ధతతో విధులను నిర్వహించాలని రైల్వేశాఖ మంత్రి సదానంద గౌడ సూచించారు. శుక్రవారం సికింద్రాబాదులోని మౌలాలిలోని ఆర్పిఎఫ్ శిక్షణా కేంద్రం నుంచి శిక్షణను పూర్తి చేసుకున్న 421 ఆర్పిఎఫ్ ఎస్ఐలు పాసింగ్ ఔట్ పరేడ్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రైల్వేమంత్రి సదానందగౌడ హాజరయ్యారు.
రైల్వే ఆస్తులను ప్రయాణికుల భద్రతకు నిరంతరం అప్రమత్తతతో విధులు నిర్వహించి రక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. ముఖ్యంగా మహిళా భద్రతపై దృష్టి సారించాలని అన్నారు. రైల్వేభద్రతను మరింత పటిష్టం చేయడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని అన్నారు.
మౌలాలి ఆర్పిఎఫ్ శిక్షణాకేంద్రాన్ని ‘నేషనల్ అకాడమీ ఫర్ రైల్వే సెక్యూరిటీ'గా మార్చనున్నామని తెలిపారు. ఈ సందర్భంగా విజయవంతంగా శిక్షణ పూర్తి చేసిన సందర్భంగా గ్రూప్ అవార్డు రు.10 లక్షలను మంత్రి ప్రకటించారు.
గౌరవ వందనం..
ఆర్పిఎఫ్ శిక్షణా కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్ఐల పాసింగ్ ఔట్ పరేడ్వో మంత్రి సదానంద గౌరవ వందనం స్వీకరించారు.
అవార్డుల ప్రదానం
ప్రతిభ కనపర్చిన ఎన్.వెంకటేశ్వర్లుకు స్వోర్డ్ఆఫ్ ఆనర్, అనిల్కుమార్ మిట్టల్కు సిల్వర్ మెడల్, ఎంఎస్ఎస్. బీనా, బి.ప్రభాకర్లకు సదానంద గౌడ పురస్కారాలను అందజేశారు.
భద్రతకు పెద్ద పీట
అభివృద్ధితోపాటు భద్రతపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సదానంద అన్నారు. అదే సమయంలో ప్రాజెక్టులు సత్వరమే పూర్తి కావడానికి ప్రత్యేక శద్ధ్ర వహించాలని అన్నారు. ముఖ్యంగా రైల్వేలో భద్రత పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని సూచించారు.
కార్యక్రమంలో...
కార్యక్రమంలో న్యూఢిల్లీ ఆర్పిఎఫ్ డైరక్టర్ జనరల్ శ్రీ క్రిష్ణచౌదరి ఐపిఎస్, రైల్వే జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాస్తవ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సికింద్రాబాద్లోని రైల్నిలయం ఆడిటోరియంలో జరిగిన పవర్పాయింట్ ప్రజంటేషనల్ జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాస్తవ గడిచిన నెలల వ్యవధిలో రైల్వే సాధించిన పురోభివృద్ధిని వివరించారు.