జయకు నో బెయిల్: తదుపరి విచారణ 7కు వాయిదా
న్యూఢిల్లీ: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బెయిల్ పిటిషన్పై బుధవారం విచారణకు చేపట్టిన కర్ణాటక హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 7కు వాయిదా వేసింది. జయలలిత బెయిల్ పిటిషన్ను రెగ్యులర్ బెంచ్ విచారణ జరుపుతుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. దీంతో జయలలిత మరికొన్ని రోజులు జైళ్లోనే గడపనుంది.
జయలలిత తరుపున ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ ఈ వ్యవహారంలో వాదనలు వినిపించారు. రాం జెఠ్మలానీ వాదనలు వినిపిస్తున్న సమయంలో కోర్టు బయట అన్నాడీఎంకే కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన జయలలిత సెప్టెంబర్ 27 నుంచి బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.
రెండు రోజుల క్రితం బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న జయలలిత పిటిషన్ ను మంగళవారం పరిశీలించిన వెకేషన్ బెంచ్, ఈ నెల 6న విచారించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలతో బుధవారం విచారణ జరగనుంది.
మరోవైపు అత్యంత ప్రాధాన్యం కలిగిన కేసుగా దీనిని పరిగణించి, తక్షణమే విచారణ చేపట్టాలని రామ్ జెఠ్మలానీ కోర్టును కోరారు. ఈ కేసు వాదించేందుకు తాను ప్రత్యేకంగా లండన్నుంచి వచ్చానని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వ్యవహారంపై పరిశీలన జరిపేందుకు ఐదు నిముషాల సమయం ఇవ్వాలని జెఠ్మలానీ విజ్ఞప్తి చేశారు. తనకు ఐదు నిముషాల సమయమిస్తే జయలలితకు వ్యతిరేకంగా దాఖలైన అక్రమ ఆస్తుల కేసులో ఎటువంటి ఆధారాలు లేవని నిరూపిస్తానని జెఠ్మలానీ మంగళవారం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
అయితే ప్రతివాది లేకుండా కేసు ఎలా వాదిస్తారంటూ జస్టిస్ చంద్రకళ జెఠ్మలానీని ప్రశ్నించారు. దీంతో ఏకీభవించని రాం జెఠ్మలానీ పదేళ్ల శిక్ష పడితేనే ప్రతివాది అవసరమని, తమ క్లయింటుకు నాలుగేళ్ల శిక్ష మాత్రమే పడిందని వివరించారు. 30 నిముషాలపాటు జయ తరఫు న్యాయవాదులు న్యాయమూర్తితో వాదనకు దిగారు.