సీమాంధ్రులకు ఛాన్స్, తీర్మానంతో ఏం కాదు: డిగ్గీ, షిండే
తెలంగాణ ఏర్పాటు పైన తాము హామీ ఇచ్చామని, దానిని నెరవేరుస్తామన్నారు. హైదరాబాదులో సీమాంధ్రులకు పూర్తి భద్రత ఉంటుందని చెప్పారు. అదే విధంగా హైదరాబాదులో సీమాంధ్రులకు విద్య, ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయని చెప్పారు. తెలంగాణను వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతల వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
తాను మధ్యాహ్నం గుల్బర్గా వెళ్తున్నానని చెప్పారు. తెలంగాణ బిల్లును డస్ట్ బిన్లో వేయాలన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో తాను ఏకీభవించనని చెప్పారు. ఆదివారం సాయంత్రం రాష్ట్రపతి భవన్కు బిల్లు చేరుతుందని చెప్పారు. తెలంగాణపై నిర్ణయానికి ముందు ముఖ్యమంత్రి ఏం చేశారని ప్రశ్నించారు. తెలంగాణ బిల్లును అడ్డుకుంటానని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. సీమాంధ్ర నేతలు అప్పుడు తమ సమస్యలపై ఎందుకు చెప్పలేదన్నారు. రాజ్యసభ రెబల్ అభ్యర్థులపై మధ్యాహ్నం మూడు గంటల వరకు చూస్తామన్నారు.
న్యాయపరమైన అంశాలు రావు: షిండే
తెలంగాణ ముసాయిదా బిల్లు విషయంలో ఎలాంటి న్యాయపరమైన అంశాలు రావని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. పార్లమెంటులో తెలంగాణ ముసాయిదా బిల్లు పాస్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తీర్మానంతో ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. కాగా, తాను ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల విద్యుత్ రంగంపై అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెసు పార్టీ కోర్ కమిటీ భేటీ అనంతరం దిగ్విజయ్, షిండేలు మీడియాతో మాట్లాడారు.
హైదరాబాదుకు విజయ్ కుమార్
కేంద్ర హోంశాఖ అధికారి, టాస్క్ఫోర్స్ చీఫ్ విజయ్ కుమార్ శుక్రవారం ఉదయం హైదరాబాద్కు చేరుకున్నారు. ఈ రోజు జరిగే గ్రేహౌండ్స్ సమావేశంలో విజయ్ కుమార్ పాల్గొననున్నారు. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో భద్రాచలం డివిజన్ పరిధిలో శాంతిభద్రతలపై చర్చించేందుకు ఆయన వచ్చినట్లు తెలుస్తోంది. తాను వ్యక్తిగత పనుల కోసమే వచ్చానని విజయ్ కుమార్ చెప్పారు.