స్మగ్లింగ్: కడుపులో గోల్డ్ బిస్కెట్లు, కోసి తీసిన వైద్యులు
న్యూఢిల్లీ: బంగారం స్మగ్లింగ్ను ఎన్ని విధాలుగా చేయాలో అన్ని విధాలుగా చేస్తున్నారు. అయినా కస్టమ్స్ అధికారులు, పోలీసులకు చిక్కిపోతూనే ఉన్నారు. దీంతో ఓ వ్యాపారి బంగారు బిస్కెట్లను స్మగ్లింగ్ చేసేందుకు కొత్తగా ఆలోచించాడు. 396 గ్రాములు కలిగిన 12 బిస్కెట్లను అతను మింగేసి కడుపులో దాచేశాడు. అయినా అతడు దొరికిపోయాడు. అతనికి ఆపరేషన్ నిర్వహించిన వైద్యులు బంగారు బిస్కెట్లను బయటికి తీశారు.
వివరాల్లోకి వెళితే చాందినీ చౌక్కు చెందిన ఓ 63ఏళ్ల వ్యాపారి నగరంలోని ఓ ఆస్పత్రిలో చేరాడు. తన కడుపులో విదేశీ లోహం ఉందని, తనకు సర్జరీ చేయాలని వైద్యులను కోరాడు. కాగా తన కుటుంబ సభ్యులు మాత్రం తమపై కోపంతో అతను వాటర్ బాటిల్ మూత మింగేశాడని తెలిపారు. అయితే ఆపరేషన్ చేసిన తర్వాత కానీ అసలు వాస్తవం బయటపడలేదు.
33 గ్రాముల బరువు కలిగిన 12 బిస్కెట్లను అతని కడుపులోంచి తీశారు వైద్యులు. అతని కడుపులోంచి బిస్కట్లు తీసేందుకు ఎంతో కష్టపడాల్సి వచ్చిందని వైద్యులు తెలిపారు. మెటల్ డిటెక్టర్ను ఉపయోగించి బిస్కెట్లను బయటికి తీశామని చెప్పారు. కాగా, పది రోజుల క్రితం సింగపూర్ వెళ్లిన అతడు, ఆ బంగారు బిస్కెట్లను మింగేసి ఇండియాకు స్మగ్లింగ్ చేశాడు. ఎయిర్పోర్టులోని సెక్యూరిటీ సిబ్బంది తప్పించుకోవడం కూడా అతడు సఫలీకృతుడు కావడం గమనార్హం. బంగారం విలువ రూ. 12 లక్షలు.
బంగారు బిస్కెట్లు బయటికి వస్తాయేమోనని అతడు, గత పది రోజులుగా ద్రవ రూపంలోని ఆహారాన్ని మాత్రమే తీసుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. తీవ్ర కడుపు నొప్పి రావడంతో అతను ఆస్పత్రికి వచ్చాడని చెప్పారు. అనుకోకుండా తాను వాటర్ బాటిల్ మూత మింగానని అతడు చెప్పినట్లు వైద్యులు తెలిపారు. అతడు చాందినీ చౌక్లో బంగారం వ్యాపారం అని, అతని ఇద్దరు కుమారులు కూడా విదేశాల్లో నివాసం ఉంటున్నారని వైద్యులు తెలిపారు. అతను తమకు 1989 నుంచి తెలుసని చెప్పారు.
కాగా, బంగారం బిస్కెట్లను బయటికి తీసిన వెంటనే తాము కస్టమ్స్ అధికారులకు, పోలీసులకు దీనిపై సమాచారం అందించినట్లు వైద్యుడు రామచంద్రన్ తెలిపారు. కస్టమ్స్ అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. ఏప్రిల్ 15న పేషెంట్ విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. గత ఆరు నెలల నుంచి స్మగ్లర్ల నుంచి భారీ ఎత్తున బంగారం స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.