వీవీఐపీ ఛాపర్ స్కామ్: గౌతమ్ ఖైతాను అరెస్టు
ఢిల్లీలోని గౌతమ్ ఖైతానుకు చెందిన రెండు ప్రదేశాల్లో సోదాలు నిర్వహించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సుమారు కోటి రూపాయల విలువ చేసే బంగారు నగలతో పాటు, అతి ముఖ్యమైన డాక్యుమెంట్స్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ స్కాంకు సంబంధించి జులైలో నమోదైన క్రిమినల్ కేసులో 21 సంస్థల పేర్లు ఉన్నాయి.
వీవీఐపీల ప్రయాణ అవసరాల కోసం అత్యుత్తమ ప్రమాణాలున్న 12 హెలికాఫ్టర్లను కొనుగోలు చేయాలని గత యూపీఏ హయాంలో నిర్ణయించారు. ఇందులో భాగంగా 2005 మార్చి 1వ తేదీన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుని ఆంగ్లో-ఇటాలియన్కు చెందిన అగస్టా వెస్ట్ల్యాండ్కు కట్టబెట్టారు.
ఈ బిడ్డింగ్లో ఆగస్టా వెస్ట్ల్యాండ్ పాల్గోనేలా చేసేందుకు చాపర్లు ఎగరాల్సిన ఎత్తు పరిమితిని 6000 మీటర్ల నుంచి 4500 మీటర్లకు తగ్గించారనేది కూడా ఒక ప్రధాన ఆరోపణ. అగస్టా వెస్ట్ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు కమిటీలో నారాయణన్, వాంఛూ, నరసింహన్లతో పాటు సుమారు 15మంది సభ్యులున్నారు.
రూ.3600 కోట్లతో 12 హెలికాప్టర్ల కొనుగోలుకు ఒప్పందం కుదిరింది. 3600 కోట్లలో 10 శాతం.. అంటే 360 కోట్లు ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో అప్పటి వైమానిక దళాధిపతి త్యాగి, ఆయన సమీప బంధువు, బ్రిటన్కు చెందిన ఓ మధ్యవర్తిసహా 13 మందిపై కేసు సీబీఐ నమోదు చేసింది.
వీరితో పాటు ఇటలీకి చెందిన ఫిన్ మెక్కానికా, బ్రిటన్కు చెందిన ఆగస్టా వెస్ట్ ల్యాండ్, చంఢీగఢ్కు చెందిన ఐడీఎస్ ఇన్పోటెక్, ఏరోమ్యాట్రిక్స్ కంపెనీలపై కూడా కేసు నమోదు చేసింది. ఏరోమ్యాట్రిక్స్ కంపెనీలో గౌతమ్ ఖైతాను బోర్డు మెంబర్. హెలికాఫ్టర్ల కొనుగోలుకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు ఈ కంపెనీ నుండే కొంత మంది వ్యక్తులు చేరినట్లు భావిస్తున్నారు.
ఇది ఇలా ఉంటే ముడుపులు చెల్లించిన ఆరోపణల నేపథ్యంలో ఫిన్ మెక్కానికా మాజీ సీఈఓ గిసెప్పీ ఓర్సీకి ఆరేళ్లు, ఆగస్టా మాజీ సీఈఓ బ్రూనో స్పాగ్నోలినీకి ఐదేళ్లు జైలు శిక్ష విధించాలని ఇటలీ ప్రాసిక్యూటర్లు కోరినట్లు ఇటలీ మీడియాలో కథనాలు వెల్లడించాయి.