అమేథిలో షాక్: ఇల్లు లేక రాహుల్గాంధీకి వింత సమస్య
లక్నో: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి సొంత నియోజకవర్గమైన అమేథిలో విచిత్రమైన సమస్య ఎదురైంది. అమేథిలో నివాస ధృవ పత్రం కోసం ఆయన దాఖలు చేసుకున్న అభ్యర్థనను సబ్ కలెక్టర్ తిరస్కరించారు. ఆ ప్రాంతానికి ప్రాతినిథ్యం వహిస్తూ అప్పుడప్పుడు వచ్చి పోతున్న రాహుల్ స్థిరంగా నివాసం ఉండడం లేదని సబ్ కలెక్టర్ అభిప్రాయపడ్డారు.
అమేథీలో రాహుల్ నివాస ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. అయితే, గత పదేళ్లుగా ఉత్తర ప్రదేశ్లోని అమేథీ లోకసభ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్న రాహుల్ గాంధీ అక్కడ గతంలో ఉన్నట్లు కానీ, ఇక మీదట అప్పుడప్పుడైనా ఉంటారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ ఎన్నికల వ్యయాన్ని చూపాలంటే అమేథిలో కచ్చితంగా బ్యాంకు అకౌంట్ ఉండాలి. ఆ అకౌంటు నుంచే ఎన్నికల వ్యయాలకు సంబంధించిన లెక్కలు చూపించాల్సి ఉంటుంది. అమేథీలో బ్యాంకు ఖాతా తెరవడానికి నివాస ధ్రువీకరణ పత్రం అవసరమైంది. రాహుల్ దరఖాస్తు చేసుకున్నారు. కానీ అమేథికి ప్రాతినిథ్యం వహిస్తున్నా, ఆ ప్రాంతంలో నివాసం ఉండని కారణంతో సబ్ కలెక్టర్ రాహుల్ అభ్యర్థనను తిరస్కరించారు.
మరోవైపు అమేథిలో రాహుల్ ప్రత్యర్థి, అమ్ అద్మీ పార్టీ అభ్యర్థి కుమార్ విశ్వాస్ ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాను అమేథిలో ఇల్లు కట్టుకుని స్థానికులకు సేవలు అందిస్తామని విశ్వాస్ చెప్పారు. రాహుల్ గాంధీలా రాజమహల్లో ఉంటూ ప్రజల్ని అప్పుడప్పుడు సందర్శించబోనని విశ్వాస్ చెప్పారు. అమేథిలో చాలా మంది ప్రజలకు ఇళ్లు లేవన్నారు. అమేథి ప్రజలు తమ కుటుంబ సభ్యులు లాంటివారని చెప్పుకునే రాహుల్ ఆచరణలో వారికి దూరంగా ఉంటున్నారని విశ్వాస్ విమర్శించారు.
అమేథిలో అభివృద్ధి జరుగుతున్నట్లు రాహుల్ చెబుతున్న దాంట్లో వాస్తవం లేదని ఆయన మండిపడ్డారు. కేవలం హామీలతోనే రాహుల్ కాలం గడిపేస్తున్నారని కుమార్ దుయ్యబట్టారు. ప్రజలు ఇప్పుడిప్పుడే వాస్తవాలు తెలుసుకుంటున్నారని ఆయన అన్నారు. రాహుల్ హయాంలో అమేథిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని బిజెపి నేత స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు.