నేర్చుకోవడం అపోద్దు: సత్య నాదెళ్ల మార్గనిర్దేశం
న్యూఢిల్లీ: మనం ఎంత ఎత్తుకు ఎదిగినా నేర్చుకోవడం అపరాదని మైక్రోసాఫ్ట్ సిఈఓ సత్య నాదెళ్ల విద్యార్థులకు సూచించారు. మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఇదే చివరి రోజు అన్న భావనతో జీవించాలని, కానీ ఎప్పటికీ జీవించే ఉంటామనే భావనతో నేర్చుకోవాలన్న గాంధీ సూక్తిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
చేసేపని పని పట్ల ఎంతో ప్రేమను పెంచుకోవాలని చెప్పిన ఆయన, అప్పుడు అది పనిలాగానే అనిపించదు అని అన్నారు. భారతదేశంలోని యువతతో మాట్లాడటం అద్భుతంగా ఉందని చెప్పారు. ఇక్కడ ఉత్సాహాన్ని, అశావాదాన్ని గమనించొచ్చని.. ఆత్మవిశ్వాసాన్ని చూడొచ్చని అన్నారు. ‘ప్రపంచాన్ని మార్చేందుకు మీరు సిద్ధమయితే.. మీ ముందు ఉండే అవకాశాలు అసమానం' అని సత్య నాదెళ్ల చెప్పారు.
సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా పెరిగినా.. అది ఉపయోగించుకోగల మనిషి శక్తి సామర్థ్యాలు అంతకంటే గొప్పవని సత్య నాదెళ్ల అన్నారు. కేవలం ఒకే రకమైన విద్యా విధానంతో సరిపెట్టుకోకుండా రకరకాల అంశాల్లో పట్టు సాధిస్తే మరింత ప్రయోజనం కలుగుతుందని ఆయన విద్యార్థులకు తెలిపారు.
ఇది ఒక గొప్ప శిబిరమని, సరికొత్త ఆలోచనలకు వేదిక అని అన్నారు. ఈ శిబిరం మానవుడి గతి శీలత గొప్పతనాన్ని తెలుపుతుందని సత్య నాదెళ్ల చెప్పారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి స్మృతీ ఇరానీ పాల్గొన్న ఈ కార్యక్రమం దేశ వ్యాప్తంగా 20 రాష్ట్రాల్లోని 300 నగరాలు, 750 ప్రదేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ కార్యక్రమాన్ని దాదాపు 35వేల మంది విద్యార్థులు వీక్షించారు.