ప్రియుడిని ఉరివేసిన ప్రియురాలి ఫ్యామిలీ: విషం ఇచ్చి..
ఎస్పీ ప్రబల్ ప్రతాప్ సింగ్ కథనం ప్రకారం.. భర్తల్ గ్రామానికి చెందిన మఖాన్ సింగ్ 15ఏళ్ల కుమార్తె ఉంది. ఆమె, రాకేష్ సింగ్ అనే యువకుడు(17) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరు ఏకాంతంగా ఉండగా.. అమ్మాయి తండ్రి మఖాన్ సింగ్, అతని నలుగురు కుమారులు సుఖ్వీర్, సునీల్, సుశీల్, ఉమిద్లకు తమ ఇంట్లో కనిపించారు.
తమ అమ్మాయి పరాయి వ్యక్తితో కనబడటంతో వాళ్లందరూ ఆగ్రహానికి గురయ్యారు. ఆ ఆవేశంలోనే మఖాన్ సింగ్, తన కుమారులు సుఖ్వీర్, సునీల్, సుశీల్, ఉమిద్లతో కలిసి బలవంతంగా అమ్మాయికి విషం తాగించారు. ఆ తర్వాత రాకేష్ సింగ్ను తీవ్రంగా కొట్టి, ఉరివేసి చంపారు.
అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఆ ఇంటి నుంచి వచ్చిన అరుపులు విని అక్కడి చేరుకున్న గ్రామస్తులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు చేరుకునే సరికే అబ్బాయి మృతి చెందాడు. కొనఊపిరితో ఉన్న అమ్మాయిని ఆస్పత్రికి తరలిచారు. ఆమె పరిస్థితి కూడా ఆందోళన కరంగానే ఉంది. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
కాగా, రాకేస్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. విషయం తెలుసుకున్న మృతుడు రాకేష్ తండ్రి.. తన కుమారుడిని నిందితులు ఇనుప రాడ్తో కొట్టి, తర్వాత ఉరేసి చంపారని ఆరోపించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి మెరుగపడిన తర్వాత ఆమె నుంచి వాంగ్మూలం తీసుకుంటామని, నిందితులను పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు.