మంత్రి కొడుకుపై కేసు: మెడలో పసుపుకొమ్ముతో నటి
బెంగళూరు: ఈ ఏడాది జూన్ 8న తనను కేంద్ర రైల్వే శాఖమంత్రి తనయుడు కార్తీక్ గౌడ పెళ్లి చేసుకున్నాడని, ఇప్పుడు మరో యువతిని పెళ్లాడేందుకు సిద్ధమవుతున్నాడని ఫిర్యాదు చేసిన ప్రముఖ నటి, మోడల్ మైత్రేయ.. బుధవారం నుండి గురువారం సాయంత్రం వరకు బోసిమెడతో కనిపించింది. అయితే, గురువారం సాయంత్రం మాత్రం హఠాత్తుగా పసుపు కొమ్మును కట్టుకొని కనిపించిందని అంటున్నారు.
కార్తీక్ గౌడ్ పైన ఆర్టీ నగర్ పోలీసు స్టేషన్లో మైత్రియ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి లిఖిత పూర్వక ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే ఆమెను అంబేడ్కర్ వైద్య కళాశాలకు తరలించి పరీక్షలను చేయించారు. ఫిర్యాదు నేపథ్యంలో మరింత సమాచారం సేకరించాలని, దీనికోసం గురువారం మధ్యాహ్నం పోలీసు స్టేషన్కు రావాలని సంబంధింత అధికారులు ఆమెకు సూచించారు.
ముందుగా నిర్ణయించిన కొన్ని ప్రదర్సనల వల్ల తాను వెళ్లలేకపోతున్నానని ఆమె విలేకరులతో చెప్పారు. ఆమె నుండి ఆధారసహిత సమాచారాన్ని రాబట్టాకే కార్తీక్ గౌడ్ను అదుపులోకి తీసుకుంటామని అధికారులు చెప్పారు. కార్తీక్ అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొనలేదన్నారు. వైద్య పరీక్షల నివేదిక వచ్చాక కేసు దర్యాఫ్తును వేగవంతం చేస్తామన్నారు.
తాను సదానంద గౌడ కుటుంబం కోడలిగా వెళ్లాలని ఆశిస్తున్నానని మైత్రేయ బెంగళూరులో తెలిపారు. కాగా, మైత్రేయ పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం తన పేరు పైన గుళ్లో ప్రత్యేక పూజ చేయించారు.