నిన్నటి ఫలితాలు మర్చిపోండి, ఆ మాటేంటి: అమిత్షా
బెంగళూరు: మంగళవారం నాటి ఉప ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీకి చేదు అనుభవం మిగిల్చిన విషయం తెలిసిందే. దీని పైన ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా బుధవారం స్పందించారు. ఉప ఎన్నికల ఫలితాలను మరిచిపోవాలని, హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల ద్వారా పార్టీ పుంజుకుంటుందని ఆయన చెప్పారు.
ఉప ఎన్నికల్లో పార్టీకి తీవ్ర పరాభావం ఎదురవడంపై కార్యకర్తలు కలత చెందొద్దని ఆయన ధైర్యం చెప్పారు. రానున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధిస్తామన్నారు.
త్వరలో మహారాష్ట్ర, హర్యానా, జమ్మూకాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. అక్కడి నుంచి కాంగ్రెస్ రహిత దేశం అజెండాతో ముందుకెళదామన్నారు. కొన్ని ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు ప్రతిపక్షాలు చాలా ఆనందంలో మునిగి పోతాయని, అప్పుడు కొన్ని ప్రాంతాల్లో బీజేపీ ఓడినందుకు, తగిన శాస్తి జరిగిందని వారు భావిస్తారని, కానీ, బీజేపీ అస్సాం, పశ్చిమ బెంగాల్లో ఖాతా తెరిచిందన్న విషయాన్ని గమనించరన్నారు.