తొలిసారి: ఢిల్లీ హైకోర్టు మహిళా సిజెగా రోహిణి
ప్రస్తుతం ఆమె వయసు 58 ఏళ్లు కాగా, మరో నాలుగేళ్లపాటు సర్వీసులో కొనసాగనున్నారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని న్యాయమూర్తుల కొలీజియం గత వారం ఆమె పేరును న్యాయమంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది. అక్కడినుంచి రాష్ట్రపతికి ప్రతిపాదనలు వెళ్లడంతో ఆయన ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. కాగా, జస్టిస్ రోహిణి 1955 ఏప్రిల్ 14న విశాఖపట్నంలో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బిఎస్సీ చేసిన తర్వాత ఆంధ్రా యూనివర్సిటీలో న్యాయశాస్త్ర పట్టా పొందారు.
అనంతరం 1980లో న్యాయవాదిగా నమోదై, సీనియర్ లాయర్ కోకా రాఘవరావు వద్ద జూనియర్గా తన ప్రస్థానం ప్రారంభించారు. ఆయన సంపాదకత్వం వహించిన 'ఆంధ్రప్రదేశ్ లా జర్నల్'కు 1985లో రిపోర్టర్గా వ్యవహరించారు. తర్వాత అదే జర్నల్కు కార్యనిర్వాహక సంపాదకురాలుగా బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్పర్సన్గానూ వ్యవహరించారు. 1995లో ప్రభుత్వ న్యాయవాదిగా బాధ్యతలు చేపట్టి, 2001లో హైకోర్టు అదనపు జడ్జిగా, 2002లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
ఉత్తర గోవా ప్రిన్సిపల్-సెషన్స్ జడ్జిగా ఉన్న అనూజా ప్రభుదేశాయ్ బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్గా నియమితులయ్యారు. దీంతో ఈ పదవి పొందిన తొలి గోవా మహిళగా ఆమె రికార్డుల్లోకి ఎక్కారు. భారత న్యాయ చరిత్రలో తొలి మహిళా సిజెగా నియమితులైనవారు జస్టిస్ లీలాసేథ్ కాగా, ఢిల్లీ హైకోర్టు జడ్జిగా ఉన్న ఆమెకు హిమాచల్ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అప్పట్లో పదోన్నతి లభించింది.
సుప్రీం సిజెగా ఆర్ఎం లోధా
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా రాజస్థాన్కు చెందిన జస్టిస్ రాజేంద్ర మాల్ లోధా నియమితులయ్యారు. ఆయన ఏప్రిల్ 27న పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం ఏప్రిల్ 26న పదవీ విరమణ చేస్తున్నందున, లోధాను సిజెగా నియమిస్తూ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 27నుంచి ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటనలో తెలిపింది. 64ఏళ్ల లోధా కేవలం 5నెలలే సిజెగా కొనసాగుతారు.