ఈ మంత్రుల తీరుపై మోడీ అసంతృప్తి, గడ్కరీపై నిఘా?
న్యూఢిల్లీ: మంత్రుల్లో కొంతమంది పని తీరుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అసంతృప్తితో ఉన్నారా!? నవంబర్లో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో వారి శాఖలను మార్చనున్నారా!? హోంమంత్రిత్వ శాఖ నుంచి రాజ్నాథ్ సింగ్ను తప్పించాలని యోచిస్తున్నారా!? అంటే అవుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తన ప్రభుత్వంలోని కొంతమంది మంత్రుల పనితీరుపై మోడీ ఇప్పటికే ఓ కన్ను వేసి ఉంచారు. ప్రతి మంత్రికి సంబంధించిన సమాచారం ఆయనకు ఎప్పటికప్పుడు చేరుతోందట. సాధ్వి ప్రాగ్యకు సంబంధించిన కేసులను నితిన్ గడ్కరీ అయితేనే సమర్థంగా డీల్ చేయగలరని మోడీ భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో తదుపరి మంత్రివర్గ విస్తరణలో హోంశాఖను ఆయనకు అప్పగించవచ్చంటున్నారు.
మహారాష్ట్ర, గుజరాత్ల్లో 2008లో జరిగిన మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో సాధ్వి ప్రాగ్యతోపాటు మరో ఇద్దరిపై అప్పటి ప్రభుత్వం కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ వారు పోలీసు కస్టడీలోనే ఉన్నారు. ఇటీవలి కాలంలో సాధ్వి ప్రాగ్య తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. సాధ్వి ప్రాగ్యను బయటకు రప్పించడంతోపాటు కేసు నుంచి ఆమెకు విముక్తి కల్పించే విషయంలో గడ్కరీ అయితేనే సమర్థంగా వ్యవహరించగలరని మోడీ భావిస్తున్నారనే ప్రచారం సాగుతోంది.
ధర్మేంధ్ర ప్రధాన్ను వ్యవసాయ శాఖకు మార్చవచ్చట. మరో ఆరుగురు మంత్రుల పని తీరును పీఎంవో నిశితంగా పరిశీలిస్తోందని ఆ వర్గాలు తెలిపాయి. నవంబర్లో ఆ ఆరుగురికీ కూడా మార్పు తప్పక పోవచ్చునంటున్నారు. అలాగే, సుష్మాస్వరాజ్ పని తీరుపై మోడీ అసంతృప్తిగా ఉన్నారట. రాజ్యసభలో గాజాపై జరిగిన చర్చకు ఆమె హాజరు కాకపోవడంపై ఆయన తన అసంతృప్తిని నేరుగా ఆమెతోనే వ్యక్తం చేశారట కూడా.
సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ పని తీరు పైనా మోడీ అసంతృప్తితో ఉన్నారట. సుష్మా నేపాల్ పర్యటనలో ఉన్న సమయంలో ఆమె ఢిల్లీలో లేరని, రాజ్యసభకు రారని తెలిసి కూడా ఇరాక్ అంశంపై చర్చకు జవదేకర్ అంగీకరించారు. వాస్తవానికి, ఇరాక్ అంశంపై చర్చించాలంటూ రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ పదే పదే పట్టుబట్టారు. జవదేకర్ చర్చకు అంగీకరించడంతో ప్రభుత్వం ఇరుకునపడాల్సి వచ్చింది. మంత్రులు చేసే చిన్న తప్పులు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతున్నాయని భావిస్తున్నారట.
గడ్కరీ నివాసంలో నిఘా పరికరాలు?
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీపై నిఘా పెట్టారని ఒక మీడియాలో కథనం వచ్చింది. 13 తీన్ మూర్తి లేన్లోని గడ్కరీ ఇంటి బెడ్రూమ్లో అత్యంత శక్తిమంతమైన, పాశ్యాత్య దేశ సంస్థలు ఉపయోగించే రహస్య వినికిడి పరికరాలు లభ్యమైనట్లు మీడియాలో కథనం వచ్చింది. వెంటనే వీటిని తొలిగించడానికి ఆదేశించినట్లు ఆ కథనం పేర్కొంది. దీనిపై స్పందించిన గడ్కరీ... అవన్నీ ఊహాగానాలేనని ట్విట్టర్లో వ్యాఖ్యానించారు.
ఈ ఉదంతంపై కాంగ్రెస్, బీజేపీ పరస్పర ఆరోపణలు, విమర్శలు చేసుకున్నారు. సీనియర్ మంత్రి నివాసంలో బగ్గింగ్ వార్తలు నిజమే అయితే అది చాలా తీవ్రమైన విషయమని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. మీడియా కథనాన్ని గడ్కరీ సన్నిహితులు కూడా ఖండించారు. బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి మాత్రం విరుద్ధంగా స్పందించారు. తనకు లభించిన సమాచారం మేరకు ఇది గతేడాది అక్టోబర్ తర్వాత మాత్రం జరిగి ఉండదన్నారు.