బస్సు లోయలో పడి 18 మంది దుర్మరణం
షిమ్లా: ఓ ప్రైవేట్ బస్సు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో లోయలో పడి 18 మంది మరణించగా, 14 మంది గాయపడ్డారు. బస్సు షిమ్లాకు 250 కిలోమీటర్ల దూరంలో రోహతుంగ్ గ్రామంలో 400 అడుగుల లోతు లోయపడింది.
బస్సులో ప్రయాణిస్తున్నవారిలో 15 మంది అక్కడికక్కడే మరణించగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ముగ్గురు మరణించినట్లు కిన్నౌర్ డిప్యూటీ కమిషన్ డిడి శర్మ చెప్పారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు.
సాంగ్లా నుంచి కల్పాకు బయలుదేరిన బస్సు మధ్యలో ప్రమాదానికి గురైంది. మృతుల్లో బస్సు డ్రైవర్, కండక్టర్ కూడా ఉన్నారు. గాయపడినవారిని బయటకు తీసి అస్పత్రికి తరలించారు.
మృతదేహాలను వెలికి తీశారు. శవాలను వారి బంధువులకు అప్పగించనున్నట్లు శర్మ చెప్పారు. గాయపడినవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరగవచ్చునని ఆయన అన్నారు. మృతులు చాలా మంది సాంగ్లా సమీపంలోని గ్రామాలకు చెందినవారే. వారిని ఇంకా గుర్తించాల్సి ఉంది.