హర్టయ్యా: తాత,ముత్తాతల చిట్టా విప్పిన సానియామీర్జా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్గా తనను నియమించడంపై చెలరేగుతున్న విమర్శల పైన టెన్నిస్ స్టార్ సానియా మీర్జా స్పందించారు. ఆమె ఈ అంశం పైన ఆమె ట్వీట్ల మీద ట్వీట్లు చేశారు. తాను పాకిస్తాన్కు చెందిన షోయబ్ అక్తర్ను పెళ్లి చేసుకున్నప్పటికీ భారతీయ వనితనే అన్నారు. అనవసర విషయాల్లో రాద్దాంతం చేయవద్దని కోరారు.
తనను తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం పైన కొంతమంది రాజకీయ నాయకులు, మీడియా విమర్శలు చేస్తూ సమయాన్ని వృధా చేస్తోందని ఆమె అన్నారు. వారి మాటలు తనను బాధించాయన్నారు. తాను తన తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ అన్నారు.
తాను షోయబ్ను పెళ్లి చేసుకున్నప్పటికీ తాను భారతీయురాలినే అన్నారు. తన చివరి శ్వాస వరకు భారతీయ వనితగా ఉంటానని చెప్పారు. సానియా మహారాష్ట్రలో పుట్టారని విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఆమె స్పందించారు. తాను పుట్టిన సమయంలో తన తల్లికి ఆరోగ్యం బాగా లేనందున ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స కోసమై అక్కడ జన్మించానని చెప్పారు.
ముంబైలో పుట్టిన తాను మూడు వారాల చిన్న వయస్సులోనే హైదరాబాదుకు వచ్చానని చెప్పారు. తన తాతముత్తాతలు వందలాది సంవత్సరాలు హైదరాబాదులో జీవించారని, తన తాత మొహమ్మద్ జాఫర్ మీర్జా ఇంజనీర్గా అక్కడే ఉన్నారన్నారు. తన ముత్తాత మహమ్మద్ అహ్మద్ మీర్జా కూడా హైదరాబాదులోనే జన్మించారని తెలిపారు. గండిపేట డ్యాం నిర్మాణంలో ఆయన పాల్గొన్నారన్నారు.
తన మరో ముత్తాత అజిజ్ మీర్జా నిజాం హయాంలో హోం సెక్రటరీగా పని చేశారన్నారు. 1908లో మూసీ వరదలు వచ్చినప్పుడు తన ఈ ముత్తాత రిలీఫ్ వర్స్క్ చూశారన్నారు. తన కుటుంబం హైదరాబాదుకు చెందినదని, వంద సంవత్సరాలకు పైగా తన కుటుంబం హైదరాబాదులోనే ఉంటోందని, తన పైన వచ్చిన విమర్శలను తాను ఖండిస్తున్నానన్న సానియా.. చివరలో తాను చెప్పిన ఈ విషయాలతో అందరి అనుమానాలు నివృత్తి అవుతాయని భావిస్తున్నానని, విమర్శలు ఆపుతారని భావిస్తున్నానని ఆమె ట్విట్టర్లో అభిప్రాయపడ్డారు.