భారతీయ ముస్లీంలు దేశం కోసం ప్రాణాలిస్తారు: మోడీ
న్యూఢిల్లీ: భారతీయ ముస్లీంలు దేశం కోసం బతుకుతారని, దేశం కోసమే ప్రాణాలు అర్పిస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం అన్నారు. భారత్లో అల్ఖైదా తీవ్రవాద సంస్థ విఫలమవుతుందని, ఎంత ప్రయత్నించినప్పటికీ ఇక్కడి వారిని తమ సంస్థలో సభ్యులుగా చేర్చుకోలేదని అన్నారు.
ఓ టీవీ చానల్ సంస్థకు ఇచ్చిన తొలి ఇంటర్వ్యూలో మోడీ మాట్లాడారు. భారతీయ ముస్లీంలో దేశానికి ఎలాంటి నష్టం కలగకూడదని ప్రగాఢంగా విశ్వసిస్తారన్నారు. అల్ఖైదా ఉగ్రవాద సంస్థ భారతీయ ముస్లింల గురించి తప్పుగా అర్థం చేసుకుంటోందని, తమ ట్యూన్లకు అనుగుణంగా భారతీయ ముస్లింలు స్టెప్పులేస్తారని అనుకుంటోందని మోడీ అన్నారు.
ఇస్లాం పేరిట జరుగుతున్న విశ్వవ్యాప్త పోరులో పాలుపంచుకోవాలని భారతీయ ముస్లింలకు పిలుపునిచ్చారు. భారతీయ ముస్లీంలు తాము చెప్పినట్లు వింటారని ఎవరైనా భావిస్తే అది వారి భ్రమే అన్నారు. కాగా, ఈ ఇంటర్వ్యూ ఆదివారం ప్రసారం కానుంది. కొన్ని భాగాలను ఆ టీవీ చానల్ శుక్రవారం ప్రసారం చేసింది.