4479 కోట్లు: హెచ్ఎస్బిసిలో భారతీయుల నల్లధనం
న్యూఢిల్లీ: విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కి తెస్తామని హామీ ఇచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఈ దిశగా మరో ముందడుగు వేసింది. జెనీవాలోని హెచ్ఎస్బిసి బ్యాంకులో భారతీయులకు చెందిన ఖాతాల్లో 4,479 కోట్ల రూపాయలు ఉన్నట్టు ప్రభుత్వం తొలిసారిగా బయటపెట్టింది. అంతేకాదు, ఈ ఖాతాలున్న 79మందిపై ఆదాయం పన్ను శాఖ చర్యలు కూడా చేపట్టిందని తెలియజేసింది.
ఆదాయం పన్ను శాఖతో పాటుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి)లాంటి ఇతర ఏజన్సీలు దేశంలోపల లెక్కల్లో చూపని మొత్తం 14,957. అలాగే, 95 కోట్ల రూపాయలకు సంబంధించిన కేసులనూ దర్యాప్తు చేస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. స్విస్ బ్యాంకుల్లో భారతీయులకు సంబంధించిన నల్లధనంపై ప్రభుత్వం వివరాలను బైటపెట్టడం ఇదే మొదటిసారి. ఫ్రెంచ్ ప్రభుత్వం నుంచి మన దేశం సంపాదించిన జెనీవాలోని హెచ్ఎస్బిసి శాఖలో ఖాతాలున్న 628మంది భారతీయులకు సంబంధించి ప్రభుత్వం ఈ వివరాలు బైటపెట్టింది.
వీటిలో 289 ఖాతాల్లో ఎలాంటి సొమ్మూ లేదని నల్లధనంపై దర్యాప్తు జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో తెలియజేసిన విషయం తెలిసిందే. ఈ 628మందిలో 201మంది నాన్ రెసిడెంట్లు లేదా జాడ తెలియని వారని, మిగతా 427మంది కేసులు చర్యలు తీసుకోదగ్గ కేసులని నల్లధనానికి సంబంధించి సిట్ సమర్పించిన రెండో నివేదికలోని ముఖ్యమైన భాగాలను విడుదల చేస్తూ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలియజేసింది.
‘వీటిలో 79 సంస్థలకు సంబంధించిన 300కు పైగా కేసుల్లో ఆదాయాల మదింపును ఆదాయం పన్ను శాఖ పూర్తి చేసింది. ఈ వ్యక్తులకు సంబంధించి ఖాతాల్లో వెల్లడించని బ్యాలెన్స్లకు చెందిన మొత్తం 2,926 కోట్ల రూపాయలను పన్ను పరిధిలోకి తీసుకురావడం జరిగింది' అని ఆ ప్రకటన తెలిపింది. ఈ మొత్తంపై వర్తించే రేట్ల ప్రకారం పన్నుతో పాటుగా పెనాల్టీలను విధించడం జరుగుతోందని ఆ ప్రకటన తెలిపింది.
‘36 కేసుల్లో 1961నాటి ఆదాయం పన్ను చట్టం కింద పెనాల్టీ చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ఇప్పటిదాకా 3 కేసుల్లో పెనాల్టీలను విధించడం జరిగింది. మిగతా అసెస్సీలకు సంబంధించి చర్యలు తీసుకోవలసి ఉంది' అని ఆ ప్రకటన తెలిపింది. అయితే ఆ ఖాతాలు కలిగి ఉన్న వారి పేర్లను మాత్రం ఆ ప్రకటనలో వెల్లడించకపోవడం గమనార్హం.
ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేతకు ప్రయత్నించిన ఆరు కేసుల్లో ప్రాసిక్యూషన్ చర్యలు చేపడుతున్నట్టు, ఇదేకాకుండా మరో 10మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు ఆ ప్రకటన తెలిపింది. మిగతా కేసులకు సంబంధించి అవసరమైన చర్యలను వేగవంతం చేస్తున్నామని, రాబోయే కొద్ది నెలల్లోనే గణనీయమైన పురోగతి ఉంటుందని ఆశిస్తున్నామని కూడా ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది. హెచ్ఎస్బిసి జాబితాకు సంబంధించిన కేసుల్లో చర్యలన్నీ వచ్చే ఏడాది మార్చి 31నాటికి పూర్తి చేయడం జరుగుతుందని అంతకుముందు ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు.