కలకలం: శ్రీలంక వెబ్సైట్లో జయపై వ్యాఖ్యలు, క్షమాపణ
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పైన శ్రీలంకకు చెందిన ఓ వెబ్సైట్లో వ్యాఖ్యలు, ఫోటోలు కనిపించాయి. దీనిపై జయలలిత ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీలంక ఆర్మీ వెబ్సైట్లో అనుచిత వ్యాఖ్యలు, అనుచిత ఫోటోల పైన ఆమె మండిపడ్డారు.
దీనిపై శ్రీలంక వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే భారత ప్రధాని నరేంద్ర మోడీకి కూడా ఆమె విజ్ఞప్తి చేశారు. అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో శ్రీలంక నుండి భేషరతు క్షమాపణలు కోరాలని విజ్ఞప్తి చేశారు. శ్రీలంక ఆర్మీ వెబ్సైట్లోని అనుచిత వ్యాఖ్యలు, ఫోటోలు కలచివేశాయన్నారు. శ్రీలంకలో ఉన్న రాయబారిని వెనక్కి పిలిపించాలని ఆమె కోరారు.
మరోవైపు, జయలలిత పైన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో శ్రీలంక ఆర్మీ శుక్రవారం భేషరతు క్షమాపణలు చెప్పింది. కాగా, జయలలి పైన శ్రీలంక ఆర్మీ వెబ్సైట్లో పెట్టిన ఆర్టికల్ కలకలం సృష్టించింది.
ఈ ఆర్టికల్ పైన పీఎంకే వ్యవస్థాపకులు ఎస్ రామదాస్ తీవ్రంగా స్పందించారు. జయలలిత ఒక్కరే క్షమాణలు కోరడం కాదని, మోడీ కూడా కోరాలన్నారు. దీని పైన శ్రీలంక అధ్యక్షుడు రాజపక్ష, డిఫెన్స్ సెక్రటరీ క్షమాపణలు చెప్పాలన్నారు. జయలలిత కేవలం ప్రజలు ఎన్నుకున్న నేతనే కాకుండా.. ఓ మహిళ కూడా అనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఈ ఆర్టికల్ ద్వారా ఏడున్నర కోట్ల మంది తమిళ ప్రజల మనసులను గాయపర్చారన్నారు. మోడీకి జయ రాసిన లేఖ అంశాన్ని వెబ్సైట్లో ఉంచిన లేఖ, రాసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.