వరకట్నంగా కిడ్నీ: అత్తింటి వేధింపులతో మహిళ సూసైడ్
హజరిభాగ్: జార్ఖండ్ రాష్ట్రంలోని హజరిబాగ్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కట్నం కోసం అత్తింటివారు పెట్టే చిత్రహింసలు భరించలేక ఓ మహిళ తనకు తాను నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఏప్రిల్ 16న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం(ఏప్రిల్ 22) మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధిత మహిళ అత్తింటి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. 2006లో బాధిత మహిళ పూనం దేవికి, సుదామ గిరి అనే వ్యక్తికి వివాహం జరిగింది. వివాహ సమయంలో రూ. 1.31 లక్షల నగదును దేవి తండ్రి బర్హన్ భారతి కట్నంగా ఆమె అత్తింటి వారికి చెల్లించాడు. అయితే మరో రూ. 25వేల రూపాయలను అదనపు కట్నంగా చెల్లించాలని దేవిని అత్తింటి వారు గత కొన్నేళ్లుగా వేధింపులకు గురి చేస్తున్నారు.
కొన్ని నెలల క్రితం దేవి భర్త సుదామ గిరి అస్వస్థతకు గురయ్యారు. వైద్యులు అతని కిడ్నీ ఫెయిలైందని చెప్పారు. దీంతో గిరి తల్లి అదనపు కట్నంగా తన కిడ్నీని ఆమె భర్తకు ఇవ్వాలని కోరింది. అంతేగాక ఇకపై ఆమెను వేధించనని కూడా చెప్పింది. దీంతో దేవి తన కిడ్నీని ఇచ్చేందుకు సిద్ధపడింది. అయినా అత్తగారి వైఖరిలో మార్పులేదు. తరచూ దేవిని వేధింపులకు గురిచేసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన దేవి ఏప్రిల్ 16న నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
ఏప్రిల్ 23న రాంఛీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధిత మహిళ ప్రాణాలు విడిచింది. బాధిత మహిళ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దేవి అత్తింటి కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా, బాధిత మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.