అళగిరి: ప్రధానికి కరుణ లేఖ, చనిపోక తప్పదని స్టాలిన్
చెన్నై: స్టాలిన్కు భద్రత పెంచాలని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డిఎంకె పార్టీ అధ్యక్షులు కరుణానిధి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు లేఖ రాశారు. అళగిరి వ్యాఖ్యల నేపథ్యంలో కరుణానిధి ఈ లేఖ రాశారు. డిఎంకె పార్టీ వర్గాల ప్రకారం కరుణ ఇటీవలే ప్రధానికి ఈ లేఖ రాశారు.
మరోవైపు అళగిరి వ్యాఖ్యల పైన స్టాలిన్ స్పందించారు. పుట్టిన ప్రతి వాడు ఏదో ఒకరోజు చనిపోక తప్పదని వ్యాఖ్యానించారు. అళగిరి దిష్టి బొమ్మలను పార్టీ కార్యకర్తలు ఎవరు దగ్ధం చేయవద్దని, ఎవరు కూడా ఈ విషయం పైన మాట్లాడవద్దని విజ్ఞప్తి చేశారు. పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రధాన కార్యదర్శి దీనిపై యాక్షన్ తీసుకున్నారన్నారు. అళగిరి దిష్టి బొమ్మలు దగ్థం చేస్తే పార్టీ యునిటీ దెబ్బతింటుందన్నారు.
కాగా, స్టాలిన్ కొద్ది నెలల్లో చనిపోతాడని అళగిరి అన్నాడని, ఓ తండ్రి ఆ మాటలను ఎలా సహిస్తాడని, స్టాలిన్పై అళగిరి ఎందుకు ద్వేషం పెంచుకున్నాడో తెలియదని డిఎంకె అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి అన్న విషయం తెలిసిందే. సోదరుడు స్టాలిన్ పట్ల చాలా కఠినమైన వ్యాఖ్యలు చేసిన అళగిరిని తిరిగి పార్టీలోకి తీసుకునే ప్రసక్తి లేదని ఆయన మంగళవారం అన్నారు.
సోదరుడు స్టాలిన్పై కఠినమైన వ్యాఖ్యలు చేసినందుకు అళగిరిని పార్టీనుంచి సస్పెండ్ చేసినట్లు ఆయన తెలిపారు. అళగిరి సస్పెన్షన్ వల్ల పార్టీకి పెద్ద నష్టం లేదని, మేలో జరిగే లోకసభ ఎన్నికల్లో పార్టీకి ఏ విధమైన నష్టం జరగదనే ఉద్దేశంతో కరుణానిధి అన్నారు.