భర్తపై దాడి: కిడ్నాపైన మహిళ కారులో శవమై తేలింది
కాన్పూర్: ఆదివారం రాత్రి కిడ్నాపయిన ఓ మహిళ సోమవారం కారులో శవమై తేలింది. ఆదివారం రాత్రి భోజనం కోసమని తన కారులో బయటికి వెళ్లిన మహిళపై బైక్లపై వచ్చిన కొందరు దుండగులు దాడి చేశారు. ఆమెతో పాటు కారులో ఉన్న భర్తని చితకబాది బయటికి తోసేశారు.
ఆ తర్వాత కారులో ఆమెను తమతోపాటు తీసుకెళ్లారు. అనంతరం ఆమెను దారుణంగా హత్య చేశారు. సోమవారం మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కారులో శవమై కనిపించిందని పోలీసులు తెలిపారు. ఆమెకు సంబంధించిన వస్తువులేమి అపహరణకు గురికాలేదని చెప్పారు.
ఐజి అషుతోష్ పాండే మాట్లాడుతూ.. డిన్నర్ కోసం బయటికి వెళ్లిన ఆ దంపతులను రాత్రి 10.15 గంటల ప్రాంతంలో గోల్ చౌక్ వద్ద పలువురు దుండగులు అడ్డుకున్నారని చెప్పారు. ఆ తర్వాత దుండుగులు బాధితురాలి భర్తను బయటికి తోసేసి ఆమెను తమతోపాటు తీసుకెళ్లారని తెలిపారు.
ఆ తర్వాత ఆమె సోమవారం రైల్వే క్రాసింగ్ వద్ద ఉన్న కారులో శవమై కనిపించిందని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.