లాహోర్-ఢిల్లీ 'దోస్తీ' బస్సును పాక్ రానివట్లేదు... వాఘా వద్ద నిలిపివేత
న్యూఢిల్లీ: భారత్ - పాకిస్ధాన్ మధ్య విబేధాలు మరోసారి బయటపడ్డాయి. ఢిల్లీ - లాహోర్ మధ్య నడుస్తున్న 'దోస్తీ' బస్సును తమ దేశంలోకి రానివ్వడానికి పాకిస్ధాన్ బుధవారం అంగీకరించలేదు.
బస్సు మార్గాన ఉగ్రవాదులు వస్తారన్న పాకిస్ధాన్ నిఘా వర్గాలు సమాచారం అందడం, ఉగ్రవాద దాడులు జరగవచ్చనే అనుమానాలు వ్యక్తం చేసిన పాకిస్ధాన్ టూరిజం అభివృద్ధి సంస్ధ బస్సు సేవలను వాఘా వరకే నడుపుతామని ప్రకటించింది.
పాఠకుల కోసం ఫేస్బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.
దీంతో పాకిస్ధాన్ నుంచి సరిహద్దు వరకు వచ్చిన ప్రయాణీకులు మరో బస్సులో ఢిల్లీ, అమృత్సర్ నగరాలకు వెళుతున్నారు. ఇక ఢిల్లీ నుంచి వెళ్తున్న ప్రయాణీకులు వాఘా సరిహద్దు దాటి పాకిస్ధాన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో ప్రయాణం చేస్తున్నారు.
1999లో మార్చి 16న అప్పటి ప్రధాన మంత్రులు వాజ్పేయి, నవాజ్ షరీఫ్లు ఈ దోస్తీ బస్సు సేవలను ప్రారంభించారు. ఢిల్లీ, అమృత్సర్ల నుండి లాహోర్లోని గుల్బర్గ్, నాన్ఖానా సాహిబ్ టెర్మినల్లకు ఈ బస్సు నడిచేది. వాఘా సరిహద్దు దాటిన తర్వాత పాకిస్ధాన్ బలగాలు దోస్తీ బస్సుకు ఎస్కార్ట్గా వస్తాయి. ఇటీవల పెషావర్ ఆర్మీ స్కూలుపై ఉగ్ర దాడి నేపథ్యంలో పాకిస్ధాన్ ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది.